టీడీపీ సంక్షేమ నిధిగా: 'ఆ అవీనితి పాపం చంద్రబాబుదే'
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక పాలసీలో కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుందని అన్నారు.
సోమవారం వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉచిత ఇసుక పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయలను లూటీ చేసి టీడీపీ కార్యకర్తలకు దోచి పెడుతున్నారని ఆయన అన్నారు. ఉచిత ఇసుక పాలసీలో అవినీతికి తావు లేకుండా ఉచితంగానే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో జన్మభూమి కమిటీలతో గ్రామాల్లోని అభివృద్ధి కుంటుపడిందని వ్యాఖ్యానించారు. జన్మభూమి కమిటీల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని, ఆ అవినీతికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. ఎస్డీఎఫ్ నిధుల కేటాయింపులో టీడీపీ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఎస్డీఎఫ్ను, టీడీపీ సంక్షేమ నిధిగా మార్చేశారని దుయ్యబట్టారు. ఓడిపోయిన వారికి, టీడీపీ కార్యకర్తలకు వందల కోట్లు కేటాయించే అధికారం సీఎంకు ఉందా? అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల పేరు మీద జీవోలు ఇచ్చి నిధులు కేటాయించడం సరికాదని అన్నారు.
దీనిపై చంద్రబాబు విచారణ జరిపి పక్షపాతధోరణితో కేటాయించిన నిధులను వెంటనే నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైన నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలకు నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే.