పరీక్షల్లో ఫెయిలైనా తల్లిదండ్రులు పల్లెత్తుమాటనలేదని...మనస్థాపంతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ప్రకాశం జిల్లా: పరీక్షలో ఫెయిలైనందుకు తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య చేసుకునేవాళ్లని చూసి వుంటారు. కానీ ఈ విద్యార్థిని మాత్రం తాను ఎగ్జామ్స్ లో తప్పినా అమ్మానాన్నలు పల్లెత్తుమాటన లేదని మరింత మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకున్న ఉదంతమిది.
ఆ విద్యార్థిని బి టెక్ థర్ఢ్ ఇయర్ చదువుతోంది. అయితే ఇంజనీరింగ్ లో నాలుగేళ్లలోపు ఎన్ని సబ్జెక్టులు ఫెయిలైనా మరుసటి ఏడాదికి ప్రమోట్ చేస్తారనే సంగతి తెలిసిందే. అయితే ఈ విద్యార్థిని ఫస్ట్ ఇయర్ నుంచి ధర్డ్ ఇయర్ వరకు 9 సబ్జెక్టుల్లో ఫెయిలైంది. అయినా తల్లిదండ్రులు ఒక్కమాట కూడా అనలేదు. దీంతో అంత మంచి తల్లిదండ్రులను బాధ పెడుతున్నాననే మనస్థాపంతో ఈ విద్యార్థిని మరింత మానసిక క్షోభకు గురై ఆ విషయాన్నే సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లా లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...
ప్రకాశం జిల్లా తురకపాలెంలో సూరా వెంకటరెడ్డి కుమార్తె గురులక్ష్మి (20) గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఈ నేపథ్యంలో గురులక్ష్మి ఫస్టియర్ నుంచి ఇప్పటివరకు తొమ్మిది సబ్జెక్టుల్లో ఫెయిలైంది. తాజాగా వచ్చిన ఫలితాలతో ఈ విషయం వెల్లడి కాగా తాను పరీక్షల్లో తప్పిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలయిబరిచింది. అయినా తల్లిదండ్రులు కుమార్తెను ఏమీ అనలేదు. దీనితో గురులక్ష్మి మరింత మనస్థాపం చెందింది. దీంతో శుక్రవారం సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
సూసైడ్ నోట్ చూసి విషయం గమనించిన తల్లిదండ్రులు, బంధువులు ఆమెను ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఈ విద్యార్థిని మృతి చెందింది. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక ఎస్ఐ రంగనాథ్ తన సిబ్బందితో కలిసి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.