ఆ ప్రభుత్వ పాఠశాలలో సీట్ల కోసం తల్లిదండ్రుల క్యూ ... నో అడ్మిషన్స్ అంటున్న టీచర్లు .. రీజన్ ఇదే
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించటం కోసం టీచర్లు నానా పాట్లు పడే పరిస్థితి నుండి చక్కని విద్యాబోధన చేస్తే సర్కారీ స్కూళ్ళకు కూడా డిమాండ్ ఏర్పడుతుందని తెలుస్తుంది . ఇక ప్రభుత్వ పథకాలు కూడా అందిస్తే తల్లిదండ్రుల చూపు సర్కారీ బడులపైన ఎలా ఉంటుందో ఏపీలోని స్కూల్స్ లో కనిపిస్తుంది. పాలకొల్లు లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అడ్మిషన్లు ఫుల్ అని బోర్డ్ పెట్టేశారంటే సర్కారు స్కూళ్ళ జోష్ ఎలా ఉందో అర్ధం అవుతుంది.
అమ్మ ఒడి పథకం ప్రభావంతో సర్కారు బడులకు పెరిగిన డిమాండ్
ఏపిలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రకటించడంతో ప్రభుత్వ పాఠశాలలకు భారీ డిమాండ్ పెరిగింది . మోడల్ పాఠశాలలు, మున్సిపల్, జెడ్పి మరియు ఎంపిపి పాఠశాలలతో సహా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. ఇక పాలకొల్లు ప్రభుత్వ పాఠశాలలో ఏకంగా నో అడ్మిషన్స్ బోర్డు పెట్టారు ఉపాధ్యాయులు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరానికి మొత్తం 1,51,719 కొత్త ప్రవేశాలు జరిగాయని, వారిలో 42,893 మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ప్రవేశం పొందారని అధికారులు తెలిపారు. తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశానికి మొత్తం 30,327 మంది విద్యార్థులు చేరినట్టు తెలుస్తుంది . ఈ గణాంకాలు తల్లిదండ్రులలో 'అమ్మ ఒడి' ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో చెబుతుంది.
15 వేల ఆర్ధిక సాయం అందుతుండటంతో చదువుపై పెరిగిన ఆసక్తి
ప్రతి సంవత్సరం, ప్రభుత్వ అధికారులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు ఆకర్షించడానికి 'బడిబాట' పేరుతో ఇంటింటికీ తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించాలని ప్రచారం నిర్వహిస్తారు. కానీ, ఈ విద్యా సంవత్సరం మాత్రం పాఠశాలలు తిరిగి ప్రారంభమైన కేవలం 4 రోజుల్లోనే ప్రభుత్వ బడులలో విద్యార్థులు సంఖ్య గణనీయంగా పెరిగింది. .ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నారులను అందరినీ చదివించటం కోసం జగన్ ప్రభుత్వం చేసిన ప్రధాన ప్రయత్నం అమ్మ ఒడి పథకం , ఇది పాఠశాలలలో తమ పిల్లలను చేర్చిన తల్లులందరికీ రూ .15 వేల ఆర్థిక సహాయం అందించే పథకం . ఇటీవల, ఇది అన్ని పాఠశాలలకు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని విస్తరించింది. ఇక పథకం నేపధ్యంలో ఇంతకాలం బడిబాట పట్టని పిల్లలు సైతం కచ్చితంగా బడిబాట పడుతున్నారు.
మెరుగైన విద్యాబోధన, అమ్మ ఒడి ఎఫెక్ట్ .. పాలకొల్లు స్కూల్ లో నో అడ్మిషన్స్ బోర్డు
ఇక పాలకొల్లు పట్టణంలోని బీవీఆర్ఎం బాలికోన్నత పాఠశాలలో మాత్రం నో అడ్మిషన్స్ బోర్డు పెట్టేశారు ఉపాధ్యాయులు . ఈ స్కూల్ లో 6 నుంచి 10వ తరగతి వరకు 630 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవతో బోధిస్తుండటంతో మెరుగైన విద్య అందిస్తున్న పాఠశాలగా గుర్తింపు తెచ్చుకొంది. అయిదేళ్ల నుంచి వరుసగా పది గ్రేడు పాయింట్లు సాధిస్తోంది ఈ స్కూల్ . దీంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తల్లిదండ్రులకు ఆ పాఠశాలపై చాలా ఆసక్తి కనబరుస్తున్నారు . తమ పిల్లలను ఇక్కడ చేర్చేందుకు ముందుకు రావడంతో పూర్తిస్థాయిలో ప్రవేశాలు పూర్తయ్యాయి. గదుల కొరత కారణంగా ఇక్కడ సీట్లు లేవని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అడ్మిషన్లు ఫుల్ కావటంతో స్కూల్ లోని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.