అంబానీ మనిషికి రాజ్యసభ సీటు.. సీఎం జగన్ అదిరిపోయే ప్లాన్.. అదేంటో వెల్లడించిన వైసీపీ
పీపీఏల రద్దు విషయంలో తీవ్ర ఆరోపణలు.. కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతోందనే వదంతులు.. సీఎం జగన్ ఆర్థిక నేరగాడు కాబట్టే ఏపీలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావట్లేదంటూ చంద్రబాబు విమర్శలు.. రాజధాని మార్పులపై తుగ్లక్ ట్యాగుతో తెలుగు తమ్ముళ్ల దాడులు.. వెరసి అధికార పార్టీని గుక్కతిప్పుకోనీయకుండా చేశామని ప్రతిపక్షం సంబురపడేలోపే.. దేశంలోనే నంబర్ వన్ కుబేరుడు, రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ స్వయంగా తాడేపల్లికి వచ్చి సీఎం జగన్ ను కలవడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఆ భేటీలో..
అసలేం జరిగిందంటే..
అంబానీకి ఆప్తుడు, రిలయన్స్ సంస్థలో కీలకవ్యక్తి అయిన పరిమళ్ నత్వానీ రాజ్యసభ అభ్యర్థిత్వంపై చర్చ జరిగింది. నిజానికి ఇండస్ట్రియలిస్టుల కోటాలో జార్ఖండ్ నుంచి పరిమళ్ మూడు సార్లు ఇండిపెండెంట్ ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో ఆయనకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతిచ్చాయి. అయితే దేశంలో రాజకీయంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్యా జాతీయ పార్టీల కంటే వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీ మద్దతుతో పరిమళ్ ను మరోసారి రాజ్యసభకు పంపాలని అంబానీ డిసైడయ్యారు. రాష్ట్రంలో పరిస్థితుల నేపథ్యంలో దీన్నొక మంచి అవకాశంగా వైసీపీ భావించింది. దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత, మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు.
Recommended Video
50 శాతం కోటా..
వైసీపీ నుంచి రాజ్యసభకు పంపబోయే నలుగురు అభ్యర్థుల పేర్లను పార్టీ నేత ఉమ్మారెడ్డి సోమవారం అధికారికంగా ప్రకటించారు. మండలి రద్దుతో పదవులు కోల్పోయిన ఇద్దరు మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లతోపాటు పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డి, అంబానీ మనిషి పరిమళ్ నత్వానీల అభ్యర్థిత్వాలను ఆయన ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఆయా సీట్లు ఎవరికి ఎందుకు కేటాయించామో వివరిస్తూ.. మోపిదేవి, పిల్లి సుభాష్ లను బీసీ కోటాలో ఎంపిక చేశామని, తద్వారా రాజ్యసభ సీట్లలో 50 శాతం ఓబీసీలకు కేటాయించినట్లయిందని ఉమ్మారెడ్డి అన్నారు. ఇక నత్వానీ విషయానికొస్తే..
ఇదీ అసలు విషయం..
విభజన తర్వాత ఐదేళ్లూ చంద్రబాబు పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని, టీడీపీ హయాంలో ఏపీ అప్పుల కుప్పగా మారిందని, అటు కేంద్రం సైతం ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోలేక పోయిందని, ఇలాంటి తరుణంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం ఒక్కటే మార్గమని సీఎం జగన్ భావించారని, అందుకే ఏపీ ఇండస్ట్రియలైజేషన్ కు పరిమళ్ నత్వానీ సహకరిస్తారనే నమ్మకంతోనే రాజ్యసభ టికెట్ ఇచ్చేందుకు అంగీకరించారని ఉమ్మారెడ్డి తెలిపారు. తన మనిషికి టికెట్ ఇచ్చే విషయమై ముఖేశ్ అంబానీ చేసిన అభ్యర్థనపై సీఎం జగన్ పార్టీలో అందరితోనూ కూలంకషంగా చర్చించారని, అందరి వాదన విన్న తర్వాతే నత్వానీకి టికెట్ పై నిర్ణయం తీసుకున్నారని ఉమ్మారెడ్డి వివరించారు.
మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు
పరోక్ష ఎన్నికల ద్వారా సభ్యులు భర్తీ అయ్యే రాజ్యసభలో ఏప్రిల్ నాటికి 55 ఖాళీలు ఏర్పడనున్నాయి. దీంతో ఆ 55 స్థానాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ గత శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 26న ఎన్నికలు జరుగనున్నాయి. తెలుగురాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 4, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.