సీఎం జగన్ ను కలిసిన పరిమళ్ నత్వానీ: రేపు రాజ్యసభకు నామినేషన్
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ ఎన్నికలకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు అభ్యర్థులను కన్ఫార్మ్ చేశాయి. తెలంగాణా లో రెండు సీట్లకు, ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలకు ఎన్నికల ప్రహసనం కొనసాగుతుంది . ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన ముఖేష్ అంబానీ కోరిక మేరకు జగన్ సీటు కేటాయించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంపీ పరిమళ్ నత్వానీ నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఏపీలో సీఎం జగన్ ను కలిసిన పరిమళ్ నత్వానీ
ఏపీలో అడుగు పెట్టిన నత్వానీ విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత సీఎం జగన్ ను కలిసి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్కు నత్వానీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నత్వానీ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ తనను రాజ్యసభకు నామినేట్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
జగన్ చెప్పినట్టు రాష్ట్రం కోసం పని చేస్తానన్న నత్వానీ
సీఎం వైఎస్ జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపినట్టు ఆయన చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. ఇక మరోమారు ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్రాభివృద్ధిపై చర్చిస్తానని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఏ బాధ్యత అప్పగించి ముందుండి పూర్తిచేస్తానని చెప్పారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులను తీసుకురావడంలో సీఎం జగన్ చెప్పినట్లు పనిచేస్తూ సాధించుకుంటామని తెలిపారు. రేపు నత్వానీ నామినేషన్ దాఖలు చెయ్యనున్నారు .
Recommended Video
సీఎం జగన్ వల్లే మూడోసారి రాజ్యసభకు వెళ్తున్నానన్న ఎంపీ
ఏపీ నుంచి పెద్దల సభకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం వల్లనే తనకు మూడోసారి రాజ్యసభకు వెళ్లే అరుదైన అవకాశం దక్కిందన్నారు. పార్టీ ఎంపీలతో కలిసి టీమ్ వర్క్ చేస్తూ రాష్ట్రం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎంపీ నత్వానీ వెల్లడించారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా నత్వానీతో పాటు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, పార్టీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డిలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు.