గోరంట్లా.. నీ చరిత్ర మాకు తెలుసు -పరిటాల రవిపై ప్రేలాపనలొద్దు: సునీత వార్నింగ్ -ఆశలపై నీళ్లు చల్లిన జగన్
అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గానికి నీరందించే ప్రాజెక్టుల శంకుస్థాపన నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ దివంగత నేత పరిటాల రవిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు పరిటాల సునీత అదే స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. పరిటాల రవి ఎంతో కష్టంతో సాధించిన కలల ప్రాజెక్టులను వైసీపీ తన ఘనతగా చెప్పుకోవడం, వాటి పేర్లు మార్చడంపై టీడీపీ భగ్గుమంది. దీంతో చాన్నాళ్ల తర్వాత అనంతలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. పొలిటికల్ హీట్ వివరాల్లోకి వెళితే..
పరిటాల రవి రక్తపిపాసి - దొంగ చంద్రబాబు అండతో కిరాతకాలు: ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలనం
అసలేం జరిగిందంటే..
రాప్తాడులో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామన్న ఎన్నికల హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్ల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హిందూపూర్ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ దివంగత పరిటాల రవి, ప్రస్తుత టీడీపీ చీఫ్ చంద్రబాబులపై సంచలన కామెంట్లు చేశారు. రవిని రక్తపిపాసిగా, చంద్రబాబును దొంగగా అభివర్ణిస్తూ మాధవ్ చేసిన వ్యాఖ్యలు జిల్లాలో కలకలం రేపాయి. వీటిపై పరిటాల సతీమణి, మాజీ మంత్రి సునీత గురువారం స్పందించారు. ప్రాజెక్టు పేరు మార్పుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు మాట్లాడారు..
వైసీపీ ఎంపీ మాధవ్ ఏమన్నారంటే..
‘‘నక్సలిజం, ఫ్యాక్షనిజం పేరుతో పరిటాల రవి ఎంతో మంది తలలు నరికాడు. రాప్తాడు నియోజకవర్గంలో పొలాలకు నీరు లేక ఎండిపోతుంటే.. పరిటాల రవి రక్తపు టేర్లతో పొలాలను తడిపాడు. పంట పొలాలను రక్తంతో తడిపిన చరిత్ర పరిటాల రవిది. ఇదంతా చంద్రబాబు సహకారంతోనే చేశాడు. అదే చంద్రబాబు.. జడ్జి పదవులకు బీసీలు పనికిరారని అన్నారు. ఏపీ ప్రత్యేక హోదాను పశువుల సంతలా.. కేంద్రానికి వేలంలో అమ్మేశాడు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి.. దొంగలా అమరావతికి పారిపోయాడు'' అని గోరంట్ల మాధవ్ అన్నారు. కాగా,
గోరంట్లకు పరిటాల సునీత వార్నింగ్..
పరిటాల రవిని ఉద్దేశించి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గోరంట్లా.. నీ చరిత్ర మాకు తెలుసు. నీలాగా రోడ్డెక్కి మాట్లాడి మా విలువను తగ్గించుకోలేం. అసలు పరిటాల రవి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావ? పరిటాల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలు ప్రశాంతంగా ఉన్నారు. ఇంకోసారి పరిటాలపై ప్రేలాపనలు చేస్తే ఊరుకునేది లేదు'' అని పరిటాల సునీత హెచ్చరించారు. మరోవైపు..
పరిటాల కుటంబం ఆశలపై నీళ్లు
రాప్తాడు నియోజకవర్గానికి నీరందించే ప్రాజెక్టుకు పరిటాల రవి పేరును తొలగించడంపై టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పేరు మార్పు ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాలో అత్యంత వెనుకబడిన రాప్తాడు నియోజకవర్గానికి సాగు నీటి సౌకర్యం కోసం పరిటాల రవీంద్ర 1994లో శాసనసభ్యుడైనప్పటి నుంచి ఎంతగానో తపించారని, అప్పట్లోనే ఉపగ్రహ చాయా చిత్రాల సహాయంతో అక్కడున్న నీటి వనరులను అధ్యయనం చేయించి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని, చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో పరిటాల కలల ప్రాజెక్టు పనులు కూడా జరిగాయని, వాటికి పరిటాల పేరు కూడా పెట్టారని, టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని జగన్ తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని కాల్వ మండిపడ్డారు.
జగన్ చర్య ఆత్మహత్యాసదృశం
పరిటాల రవి కష్టంతో ఊపిరిపోసుకుని, చంద్రబాబు హయాంలో నిధులు కూడా మంజూరైన రాప్తాడు నీటి ప్రాజెక్టులకు వైసీపీ హయాంలో ఒక్కపైసా అదనంగా ఇవ్వకుండా, శంకుస్థాపన చేసి సంబురాలు చేసుకోవడం సిగ్గుమాలిన చర్య అని టీడీపీ నేత శ్రీనివాసులు విమర్శించారు. ‘‘ప్రాజెక్టుకు పరిటాల పేరును తొలగించడం, వాటిని తన ఘనతగా చెప్పుకొంటున్న సీఎం జగన్ తీరు నిజంగా ఆత్మహత్యాసదృశం. ప్రాజెక్టుకు పరిటాల రవి పేరు తొలగించి, వైఎస్ఆర్ పెన్నార్ అని పెట్టుకున్నారు. ఈ జగన్ కు పేర్ల పిచ్చి పట్టుకుంది. ఈ జీవోను వెంటనే రద్దు చేసి, పరిటాల పేరునే కొనసాగించాలి'' అని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.
RRR:వైసీపీకి మేకు -జగన్కు తలపోటు -రాజుకు చెక్ పెట్టేదెవరు? -చంద్రబాబును తలదన్నిన రఘురామ