పరిటాల రవీంద్ర... ఓ పొలిటికల్ వెపన్: టిడిపి వర్సెస్ వైసిపి
అనంతపురం: మాజీ మంత్రి, దివంగత టిడిపి నేత పరిటాల రవీంద్ర ఇప్పటికీ నాయకులకు రాజకీయ అస్త్రంగా మారుతున్నారు. పరిటాల 2005 జనవరి నెలలో హత్య గావించబడ్డారు. ఆయన చనిపోయి పదకొండేళ్లు గడిచినా ఇంకా ఆయన చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి.
ఈ కేసులో నిందితులైన మద్దెలచెర్వు సూరి, మొద్దు శ్రీనులు వేర్వేరు ఘటనల్లో హత్య చేయబడ్డారు. పరిటాల రవి హత్య, తదనంతర పరిణామాలు తెలుగుదేశం పార్టీకి, ఇతరులకు ఆయుధంగా మారాయి. సందర్భం వచ్చినప్పుడల్లా పరిటాల రవి హత్యను రాజకీయ నాయకులు తెరపైకి తీసుకు వస్తున్నారు.
ముద్రగడా! నా భర్తను లాగకు, బాబు నాకు దేవుడు: సునీత, బీజేపీ ఎమ్మెల్యే షాక్
పరిటాల రవి హత్య కేసును రీ ఓపెన్ చేయాలని టిడిపి చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తోంది. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి నాడు సీబీఐని ప్రభావితం చేశాడని, అందుకే కేసు సరైన దిశలో విచారణ జరగలేదని భావిస్తున్నారు. అసలు, ఈ కేసులో వైయస్ జగన్ పాత్ర ఉందని, కానీ ఆ దిశలో విచారణ జరగలేదని వారి అభిప్రాయం.
ఇప్పుడు టిడిపి అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. దీని పైన దృష్టి సారిస్తారని అంటున్నారు. పరిటాల హత్య కేసులో ప్రధానంగా టిడిపి నేతలు ఇరువురి వైపు వేలు చూపించారు.
ఇటీవల ముద్రగడ పద్మనాభం కూడా పరిటాల రవీంద్ర పేరును తీశారు. దానికి మంత్రి, టిడిపి నేత పరిటాల సునీత కూడా కౌంటర్ ఇచ్చారు. తన భర్త పేరును రాజకీయాల కోసం వాడుకోవద్దని ఆమె హితవు పలికారు.
అయితే, సీబీఐ విచారణ, నివేదిక మాత్రం.. పరిటాల, మద్దెలచెర్వు సూరి కుటుంబాల మధ్య గొడవ కారణంగా ఈ హత్య జరిగినట్లుగా తేల్చింది. 24 జనవరి 2005న హత్య జరిగింది.
ఆరేళ్ల విచారణ అనంతరం అనంతపురం జిల్లా సెషన్స్ కోర్టు ఎనిమిది మంది నిందితలను నేరస్తులుగా గుర్తించింది. నారాయణ రెడ్డి, రేఖమయ్య, రంగనాయకులు, కొండయ్య, వడ్డె శ్రీనివాసులు, మెడిమి ఓబి రెడ్డి, పెద్ది రెడ్డి, హనుమంత రెడ్డిలను నిందితులుగా తేల్చి, వారికి జీవిత ఖైది విధించింది. మరికొందరిని నిర్దోషులుగా తేల్చింది.