పెళ్లిపై పరిటాల శ్రీరామ్ ఏమన్నారు: 2019 ఎన్నికలే టార్గెట్?
అనంతపురం: 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కుమారుడు పరిటాల శ్రీరామ్ బరిలోకి దిగనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటి నుంచి ఆయన ఆ దిశగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు.
అనంతపురం జిల్లాలోని కరువు మండలాల్లో తన తండ్రి బ్రతికి ఉన్న సమయంలో చేయించిన సామూహిక వివాహాలకు ఇప్పుడు పరిటాల శ్రీరామ్ శ్రీకారం చుట్టారు. జిల్లాలోని సుమారు 250 పేద కుటుంబాలకు ఒక జత కొత్త బట్టలు, తాళిబొట్టు, మెట్టలను ఈ వివాహా కార్యక్రమంలో అందించనున్నారు.
ఈ సామూహిక వివాహాల కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అనంతపురంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడం అనేది ఎంతో ఆర్ధిక భారంగా మారింది. ఈ క్రమంలో సామూహిక వివాహాల ద్వారా రైతులకు కొంత మేరకు సాయం చేసినట్లు ఉంటుందని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కాగా ఈ సామూహిక వివాహాల కార్యక్రమంపై నిర్వహించిన మీడియా సమావేశంలో పరిటాల శ్రీరామ్ తన పెళ్లి ప్రస్తావన గురించి కూడా మాట్లాడారు. తొమ్మిది ఊళ్ల చుట్టూ ఎవరు గోడ కడితే వారి పిల్లని చేసుకుంటానని చెప్పారట కదా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు పరిటాల శ్రీరామ్ చమత్కారంగా స్పందించారు.
తమ కుటుంబం అంటే తమ గ్రామమని అన్నారు. తమ గ్రామం అంటే తమ ఊరి చుట్టూ ఉన్న ఎనిమిది ఊర్లని చెప్పారు. ఈ ఎనిమిది ఊర్లు ఒకే కుటుంబంలా కలిసిమెలసి ఉంటాయని ఆయన అన్నారు. సంతోషమైనా, బాధైనా తామంతా ఒకే కుటుంబంలా ఉంటామని, అందుకే తమ ఊరు చుట్టూ ఎవరు గోడకడితే వారి పిల్లను పెళ్లి చేసుకుంటానని సరదాగా అన్నానని, తమ ఊరు అంటే తమ తొమ్మిది గ్రామాలని చెప్పారు.
అయినా తొమ్మిది ఊర్ల చుట్టూ గోడకట్టేవారు ఎవరుంటారండీ? అని ఆయన అన్నారు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు తప్పించుకోవడానికి అలాంటివి చెబుతుంటామని ఆయన నవ్వేశారు. ఈ సామూహిక వివాహాల కింద అనంతపురం జిల్లా నుంచి సుమారు 250 పేద కుటుంబాలు రిజిస్టర్ చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
కాగా, చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో పరిటాల రవీంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలను సమూలంగా ప్రక్షాళన చేశారు. 2004లో పరిటాల రవీంద్ర ఈ సామూహిక వివాహాలకు శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 8, 2004న అనంతపురం జిల్లాలోని రామగిరి మండలంలో ఉన్న ముత్యాలపల్లి శ్రీ తిరుమల దేవరాయ దేవస్థానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
1000కి పైగా పేద జంటలకు వివాహం జరిపించిన ఈ వేడుకలో సుమారు కోటి రూపాయల వరకు ఆయన ఖర్చు చేశారు. ఆయన మరణాంతరం కుమారుడు పరిటాల శ్రీరామ్ పరిటాల రవీంద్ర ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఈ వివాహా కార్యక్రమాన్ని ఏప్రిల్ 21న ఉదయం 9.45 గంటల నుంచి 11.05 మధ్య నిర్వహించనున్నారు.