నాపై కుట్రతోనే, అలా చేస్తే చంద్రబాబే శిక్షించేవారు: పరిటాల శ్రీరామ్
హైదరాబాద్/అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ అన్నారు. శ్రీరామ్ నేతృత్వంలో పది క్రిమినల్ గ్యాంగ్స్ ఏర్పాటు అయ్యాయని, ఆయన వర్గీయులు విచ్చల విడిగా నేరాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
తప్పుడు కథనాలు వద్దు, ఆ అమ్మాయి మృతి, కిడ్నాప్తో సంబంధం లేదు: పరిటాల శ్రీరామ్
ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను పదిమంది హత్యకు కుట్రపన్నానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. ఈ ఆరోపణలను విజయసాయిరెడ్డి నిరూపించాలని సవాల్ విసిరారు.
చమన్ తన చిన్నాన్న లాంటి వారని, కష్టాల్లో నష్టాల్లో తామందరం కలిసి పనిచేశామని తెలిపారు. చమన్ను తమ కుటుంబమే చంపిందని అనడం చాలా బాధాకరమని శ్రీరామ్ అన్నారు. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని, ఏదో పిచ్చిగా మాట్లాడటం తగదని హితవు పలికారు.
టీడీపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఈ పార్టీలో నాయకులు ఎంతో క్రమశిక్షణతో ఉంటారని చెప్పారు. తాను నిజంగా తప్పులు చేసి ఉంటే చంద్రబాబునాయుడు తనను ఉపేక్షించే వారు కాదని.. తనను కఠినంగా శిక్షించేవారు' అని శ్రీరామ్ వ్యాఖ్యానించారు.