వైసీపీ ప్రభుత్వానికి పరిటాల శ్రీరామ్ ఓపెన్ ఛాలెంజ్..నిరూపించు చూస్తా అంటూ
ఏపీలో రాజధాని రచ్చ ఇంకా కొనసాగుతుంది. అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. మూడు రాజధానుల ప్రకటన చేసిన ఏపీ సీఎం జగన్ రాజధాని తరలించాలనే నిర్ణయంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాజధాని తరలింపునకు నిరసనగా రాజధాని ప్రాంత రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మూడు రాజధానుల ప్రతిపాదన సీఎం జగన్ మోహన్ రెడ్డి పెట్టిన నాటి నుండీ నేటివరకు అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే వున్నారు. ఇక రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ను సాకుగా చూపుతున్న వైసీపీ నేతలకు టీడీపీ నేతలు సవాళ్లు విసురుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ అంటూ లేఖ పోస్ట్ చేసిన పరిటాల శ్రీరామ్
ఇక ఇదిలా ఉంటె నిన్న వైసీపీ నేతలు రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వీడియోలతో మరీ చూపించారు. టీడీపీ నేతలు రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని పేర్లతో సహా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ఓపెన్ గా సవాల్ విసిరారు. ఆరోపణలు కాదు నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు .
ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ తప్పుడు ఆరోపణలు అంటూ ఆగ్రహం
సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ సవాల్ లో ఆయన తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు . అమరావతిలో తమకు భారీ ఎత్తున స్థలాలు ఉన్నాయని వైసీపీ నేతలు అనవసరపు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు . ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో తమకు సెంటు భూమి అయినా ఉందని నిరూపించాలని డిమాండ్ చేశారు .కావాలనే టీడీపీ నేతలపై బురద చల్లుతున్నారని గతంలోనే వ్యాఖ్యలు చేసిన పరిటాల శ్రీరామ్ టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలపై ఆరోపణలు గుప్పించారు.
ఒక్క సెంటైనా భూమి ఉందని నిరూపిస్తే ఆ భూమి మొత్తం ప్రభుత్వానికే ఇచ్చేస్తాం
ఇక అంతే కాదు ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ట్వీట్ లో "మా పరిటాల కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక్క సెంటైనా భూమి ఉందని నిరూపిస్తే ఆ భూమి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేస్తాం.. మీ ప్రభుత్వానికి నిరూపించే దమ్ముంటే సవాలును స్వీకరించి ఆధారాలు చూపించండి" అంటూ చాలెంజ్ చేశారు . ఊరికే ఆరోపణలు కాదు ఆధారాలు కావాలని ఆయన పేర్కొన్నారు.
ఆధారాలు చూపించండి అన్న శ్రీరామ్.. నిరూపిస్తారా ? సర్వత్రా ఆసక్తి
ఇక ఎంతో కాలంగా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ నేతలు టీడీపీ నేతలను టార్గెట్ చేసి మరీ విమర్శలు చేస్తున్నారు.ఇక తాజాగా వీడియోలు కూడా చూపించి మరీ ఆరోపణలు చేశారు. ఆ వీడియో లో మాజీ మంత్రి పరిటాల సునీతకు భూములు ఉన్నాయని ఆరోపించారు. అంతేకాకుండా రాజధానిగా అమరావతిని ప్రకటించడానికి ముందే ఆ భూములను కొన్నారని ఆరోపిస్తున్నారు. ఇదంతా అక్కడ రాజధాని గురించి ముందే తెలిసి చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పుకొచ్చారు. కానీ అలాంటిదేమీ లేదంటున్న టీడీపీ నేతలు నిరూపించాలని సవాల్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చెప్పిందే పదేపదే చెప్పటం ఆపి నిరూపిస్తుందా అన్నది ఇప్పుడు అందరికి ఆసక్తి కలిగించే అంశం .