తప్పుడు కథనాలు వద్దు, ఆ అమ్మాయి మృతి, కిడ్నాప్తో సంబంధం లేదు: పరిటాల శ్రీరామ్
అనంతపురం: తనపై రాజకీయ కుట్రతోనే ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని మంత్రి పరిటాల సునీత తనయుడు, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిడ్నాప్లు, దందాలు తమ సంస్కృతి కాదని స్పష్టం చేశారు.
శుక్రవారం పరిటాల శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో తమ పై వస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆరు నెలలుగా జిల్లాలోనూ, రాప్తాడు నియోజకవర్గంలోనూ పరిటాల శ్రీరామ్ అది చేశారు.. ఇది చేశారంటూ ఓ పత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని అన్నారు.
ఆ అమ్మాయి పెళ్లికి తాళి పంపించాం.. అలాంటిది
గ్రామాల్లో జరుగుతున్న చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూపిస్తూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారని శ్రీరామ్ మండిపడ్డారు. కనగానపల్లి మండలం కేఎన్ పాళ్యంలో ఓ అమ్మాయి మృతి ఘటనను తనపై నెట్టడానికి నానా హంగామా చేశారన్నారు. ఆ అమ్మాయి పెళ్లికి తమ ఇంటి నుంచే తాళిబొట్టు, చీర పంపించామని తెలిపారు. కందుకూరు గ్రామంలో ఇటీవల జరిగిన గొడవ కారణంగా ఓ హత్య జరిగిందన్నారు. అది కూడా తనపై రుద్దేందుకు ప్రయత్నించారన్నారు.
చమన్ చనిపోయిన బాధలో ఉంటే..
కులాలను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి గురించి మాట్లాడే అవకాశం లేదు కాబట్టే ఇలాంటి తప్పుడు ఆరోపణలతో లబ్ధిపొందాలని చూస్తున్నారన్నారు. పరిటాల కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చమన్సాబ్ చనిపోతే.. ఇప్పటికీ ఆ బాధ నుంచి తేరుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. అయితే ఆయన మృతిపై కూడా వివిధ రూపాల్లో ఆరోపణలు చేస్తూ.. ఓ పత్రిక కథనాలు రాయడం ఆవేదన కలిగిస్తోందన్నారు.
ఆ కిడ్నాప్తో సంబంధం లేదు
ధర్మవరం కిడ్నాప్ ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని పరిటాల శ్రీరామ్ చెప్పారు. అయితే అందులో తన హస్తమున్నట్లు జిల్లాలోని తమ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రచారం చేయించారన్నారు. నాలుగేళ్లుగా మంత్రి కుమారుడిగానే ఉన్నా, ఎప్పుడూ లేని ఆరోపణలు ఇప్పుడెందుకు చేస్తున్నారో వారికే తెలియాలన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాననే సంకేతాల నేపథ్యంలోనే త నపై ఇలాంటి కుట్రలకు తెరలేపారని అన్నారు. అన్ని విషయాలను పార్టీ అధినేత దృష్టికి తీసుకెళుతున్నామని చెప్పారు.
తప్పుడు కథనాలు వద్దు
పరిటాల కుటుంబం రాప్తాడు, అనంతపురం జిల్లాకే పరిమితం కాదని, రాష్ట్రవ్యాప్తంగా అభిమానులున్నారని శ్రీరామ్ అన్నారు. తమ వద్దకు ఎంతోమంది వస్తుంటారని, తమతో సెల్ఫీలు దిగుతుంటారన్నారు. అందులో ఎవరో తప్పు చేస్తే తమ పై రుద్దడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. మీడియా కూడా వాస్తవాలు తెలుసుకుని కథనాలు ప్రచురించాలని సూచించారు. అణచివేయబడిన ప్రజలకు తాము అండగా ఉంటున్నామని తెలిపారు. తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలను ప్రజలు పట్టించుకోరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు సరైన సమాధానం చెబుతారని అన్నారు.