‘జై అమరావతి’: ఇక్కడికి వస్తుంటే కన్నీళ్లు వచ్చాయంటూ పరిటాల శ్రీరామ్
అమరావతి: 'జై అమరావతి' అంటూ రాజధాని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం అమరావతి ప్రాంతంలోని మందడం, వెలగపూడి గ్రామాల్లో దీక్షా శిబిరాలను సందర్శించి మద్దతు తెలిపారు.
వైసీపీ సర్కారు మెడలు వంచాలంటూ..
రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ మహిళలు, రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పరిటాల శ్రీరామ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాజధాని మార్పు విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న వైసీపీ సర్కారు మెడలు వంచాలన్నారు.
జై అమరావతి అంటూ..
ప్రజా ఉద్యమం ముందు ఎవరైనా తలవంచాల్సిందేనన్నారు. జై అమరావతి నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో అసెంబ్లీలో తమకు అనుగుణంగా బిల్లులు ఆమోదించుకునేందుకు ప్రయత్నం చేస్తోందని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు.
కన్నీళ్ళు వచ్చాయి..
రైతులు చేస్తున్న ఉద్యమం వారి కోసం కాదని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి కోసమని ఆయన అన్నారు. ఉద్యమం చేస్తున్న వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ దేవిలాగా రాజధాని మహిళలు ఉద్యమం చేస్తున్నారని అన్నారు. సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉందని, అందుకే తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. తాను వస్తున్న సమయంలో అమరావతి ప్రాంతంలో నిర్మాణమైన సచివాలయం, భవనాలు, హైకోర్టు చూస్తుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని అన్నారు. రాజధాని కోసం ప్రాణాలర్పించిన రైతులకు ఉద్యమ వందనాలు చేశారు. వెలగపూడిలో మృతి చెందిన రైతు అప్పారావు భౌతికకాయానికి శ్రీరామ్ నివాళులర్పించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
ఒకే రాజధాని అంటూ టీడీపీ తీర్మానం
ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగాలని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం తీర్మానించింది. ఆదివారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కీలక నేతలు పాల్గొన్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం అసెంబ్లీ, మండలిలో బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో ఎలాంటి వైఖరి అవలంభించాలన్నదానిపై నేతలు కీలకంగా చర్చించారు. పలువురు నేతలు తమ అభిప్రాయాలను, సూచనలను వెల్లడించారు. ఆదివారం రాత్రి ఈ సమావేశం ముగిసిన అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు టీడీపీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్కు టీడీపీ కట్టుబడి ఉందని రామానాయుడు స్పష్టం చేశారు. సోమవారం శాసనసభలోనూ ‘ఒకే రాజధాని-ఒకే అసెంబ్లీ'కి అనుకూలంగానే తమ వాదనలు ఉంటాయని తెలిపారు.