టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల కుటుంబంలో విషాదం
అనంతపురం: మాజీ మంత్రి, దివంగత టీడీపీ నేత పరిటాల రవి కుటుంబంలో విషాదం నెలకొంది. పరిటాల శ్రీరాములయ్య సోదరుడు పరిటాల గజ్జలప్ప అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
గజ్జలప్ప మృతితో పరిటాల కుటుంబంలో విషాదం నెలకొంది. పరిటాల అభిమానులు, టీడీపీ నేతలు పరిటాల ఇంటికి వచ్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, గజ్జెలప్ప అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం స్వగ్రామం వెంకటాపురంలో జరగనున్నాయని పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలిపారు.
'కామ్రేడ్ పరిటాల శ్రీరాములయ్య గారి సోదరుడు, పరిటాల గజ్జలప్ప గారు ఈ రోజు ఉదయం స్వర్గస్థులయ్యారు. అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4:00గంటలకు వెంకటాపురం గ్రామంలో జరుగుతాయని తెలియజేస్తున్నాము...' అని పరిటాల శ్రీరామ్ తన పోస్టులో వెల్లడించారు.
గజ్జలప్ప భౌతికకాయానికి వెంకటాపురం గ్రామంలో టీడీపీ నేత, పరిటాల రవి సతీమణి సునీత నివాళులర్పించారు. టీడీపీ నేతలు కాలవ శ్రీనివాసులు, ఇతర నేతలు కూడా నివాళులర్పించారు. కమ్యూనిజంపై ఆసక్తితో శ్రీరాములయ్యతోపాటు గజ్జలప్ప కూడా ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారు. పలు భూపోరాటాలు కూడా చేశారు. తలారి నరసింహులుపై దాడి ఘటనలో పరిటాల శ్రీరాములయ్య, గజ్జలప్పతోపాటు 46 మందిపై హత్య కేసు నమోదైంది. ఈ కేసులో దాదాపు రెండేళ్లపాటు శ్రీరాములయ్య, గజ్జలప్ప జైల్లోనే గడిపారు.