అసెంబ్లీలో సమాధానం చెప్పడానికి ఇబ్బందిపడిన పరిటాల సునీత
అమరావతి: ఏపీ అసెంబ్లీలో చంద్రన్న పెళ్లి కానుక వివాహ రిజిస్ట్రేషన్ పైన మంగళవారం వాడి వేడి చర్చ సాగింది. ఈ వివాహాలను పంచాయతీ కార్యదర్శులు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని టీడీపీ ఎమ్మెల్యే కూన రవి ప్రశ్నించారు. ఈ సమయంలో సమాధానం చెప్పడానికి మంత్రి పరిటాల సునీత కొంత ఇబ్బంది పడ్డారు.
బిల్లులో కొన్ని సవరణలు చేయాలని కూన రవి సహా పలువురు సూచనలు చేశారు. సవరణలు అవసరం లేదని, బిల్లును ఆమోదించాలని పరిటాల సునీత కోరారు. దీనిపై మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లుపై చర్చ లేకుండా, సవరణలు లేకుండా ఎలా ఆమోదిస్తారని నిలదీశారు.
చంద్రబాబుపై రోజా విమర్శలు
ఆంధ్రప్రదేస్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. యావత్ దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. చంద్రబాబు 92 శాతం అప్పుల్లో ముంచేశారని విమర్శించారు. ఆయన తనయుడు నారా లోకేష్ ఆస్తులు మాత్రం 55 నెలల్లో 22 రెట్లు పెరిగేలా చేశారన్నారు.
రాష్ట్రం రెండున్నర లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి జారుకుందన్నారు. పాదయాత్ర ద్వారా కష్టాల్లో ఉన్న ప్రజలకు జగన్ వెలుగు చూపిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పాలనకు ముగింపు పలికేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత జగన్ సీఎం అవుతారన్నారు.