అసమ్మతి: పరిటాల సునీత కోటకు బీటలు తప్పవా?
అనంతపురం: పరిటాల కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాప్తాడు నియోజకవర్గంలోని టీడీపీ తమ్ముళ్లకు విలువ లేకుండా పోయిందా? అసమ్మతితో ఉన్న తమ్ముళ్లు ఎట్టకేలకు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
వివరాల్లోకి వెళితే, రాజకీయ పెత్తనాన్ని భరించలేని అధికార పార్టీకి చెందిన కనగానపల్లి ఎంపీపీ బిల్లే రాజేంద్ర, వైస్ ఎంపీపీ వెంకట్రామిరెడ్డి కొన్ని రోజులుగా ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. చివరకు రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా వీరు పాల్గొనలేదు.
జన్మభూమి కమిటీలు, పార్టీ ఇన్చార్జిల ఏర్పాటుతో ప్రభుత్వ కార్యకలాపాల్లో వీరికి సరైన ప్రాధాన్యత దక్కలేదని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎంపిక మొదలు మండల స్థాయి సమావేశాల్లో కూడా వీరికి సరైన ప్రాధాన్యత కల్పించలేదని తెలుస్తోంది.
దీంతో వీరిద్దరూ తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. వీరితో పాటు మరో ఇద్దరు ఎంపీటీసీలు కూడా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని వాళ్లిద్దరూ ధ్రువీకరించారు.
2014లో కనగానపల్లి మండలంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీకి ఆరు, టీడీపీ ఐదు స్థానాలు దక్కాయి. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు టీడీపీ నాయకులు లొంగదీసుకుని ఎంపీపీ పదవి దక్కించుకున్నారు.
పదవులను ఇచ్చినా, వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో టీడీపీలో అసమ్మతి రాజుకుంది. అనుకున్న రీతిలో కనగానపల్లి ఎంపీపీ, వైస్ ఎంపీపీ తమ పదవులతో పాటు ఎంపీటీసీ స్థానాలకు రాజీనామా చేస్తే మండలంలో పలు రాజకీయ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.