జగన్ నేర్చుకోవాలి, నంద్యాల టీడీపీదే: పరిటాల, ప్రత్తిపాటి విసుర్లు
నంద్యాల ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని ఏపీ మంత్రి పరిటాల సునీత ధీమా వ్యక్తం చేశారు.
కర్నూలు/గుంటూరు: నంద్యాల ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని ఏపీ మంత్రి పరిటాల సునీత ధీమా వ్యక్తం చేశారు. ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్బంగా ఆమె మాట్లాడారు. ఎవరెన్ని మాటలు చెప్పినా.. మభ్యపెట్టినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఓటెయ్యాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఎన్నడూ లేనివిధంగా నంద్యాలలో అభివృద్ధి జరిగిందని, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సీఎం కాలేడని స్పష్టం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని, హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలని సునీత హితవు పలికారు.
కాకినాడ, నంద్యాల టీడీపీదే: ప్రత్తిపాటి
నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అవినీతి డబ్బుతో దొడ్డిదారిన గెలవాలని ప్రయత్నిస్తున్న జగన్ ప్రయత్నాలను ప్రజలే తిరస్కరిస్తున్నారని అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ చేసిన అరాచకాలు, దోపడీలు ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధి ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందని ప్రత్తిపాటి తెలిపారు.