పవన్ కళ్యాణ్ సభకు పరిటాల సునీత డుమ్మా
అనంతపురం: తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం సాగిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం బహిరంగ సభకు రాప్తాడు నియోజకవర్గం అభ్యర్థి పరిటాల సునీత దూరంగా ఉన్నారు. ఇది అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బిజెపి, తెలుగుదేశం కూటమికి ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ సోమవారంనాడు అనంతపురం వచ్చారు ఈ సభలో టిడిపి లోకసభ అభ్యర్థి జెసి దివాకర్ రెడ్డి, శాసనసభ అభ్యర్థి జెసి ప్రభాకర చౌదరి పాల్గొన్నారు.
పరిటాల సునీత తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాప్తాడు అనంతపురానికి చాలా దగ్గరలో ఉంటుంది. ఇది అనంతపురం లోకసభ స్థానం పరిధిలోకే వస్తుంది. అయినా పరిటాల సునీత మాత్రం సభకు రాలేదు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభలో ప్రభాకర చౌదరి, దివాకర్ రెడ్డి పేర్లు చెప్పారు. కానీ పరిటాల సునీత పేరు మాత్రం చెప్పలేదు.
పవన్ కళ్యాణ్తో పరిటాల కుటుంబానికి విభేదాలు ఉన్నట్లు ప్రచారం సాగిన విషయం తెలిసిందే. పరిటాల సునీత భర్త పరిటాల రవి చేతిలో పవన్ కళ్యాణ్కు పరాభవం జరిగిందని అప్పట్లో ప్రచారం సాగింది. దీన్ని గతంలో పవన్ కళ్యాణ్ ఓసారి ఖండించారు. ఆ విషయంపై పరిటాల మాత్రం స్పందించలేదు.
దానికితోడు, అనంతపురం లోకసభ అభ్యర్థి జెసి దివాకర్ రెడ్డితో పరిటాల కుటుంబానికి పడదు. పరిటాల సునీత విభేదించినా, సర్దిచెప్పి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జెసి దివాకర్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు.