పరిటాల అనుచరుడు చమన్ పదవిని వదులుకోక తప్పదా?
అనంతపురం: ఇరు వర్గాల మధ్య ఒప్పందం ప్రకారం దివంగత నేత పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు చమన్ అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని వదులుకోక తప్పదా అనే ప్రశ్న ఉదయిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం కుదిర్చిన సయోధ్య మేరకు రెండున్నర ఏళ్ల తర్వాత చమన్ చైర్మన్ పదవిని నాగరాజుకు అప్పగించాల్సి ఉంటుంది. అందుకు చమన్ సిద్ధపడ్తారా అనే సందేహం కూడా ఉదయిస్తోంది.
పదేళ్ల కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో చమన్ పూర్తిగా అజ్ఞాత జీవితమే గడిపారు. టిడిపి విజయం సాధించడంతో ఆయన అనంతపురం జిల్లా చైర్మన్ పదవిని చేజిక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అజ్ఞాతం నుంచి బయటకు వచ్చిన చమన్ రామగిరి జడ్పిటీసి స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు.
జిల్లా పరిషత్ ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించింది. అయితే, జిల్లా పరిషత్ చైర్మన్ పదవి విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. రాయదుర్గం నుంచి విజయం సాధించిన పూల నాగరూజు కూడా చైర్మన్ పదవికి పోటీ పడ్డారు. అయితే, పార్టీ పెద్దలు ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చి ఇరువురు చెరో రెండున్నరేళ్ల అధ్యక్ష పదవిని నిర్వహించే విధంగా ఒప్పందం చేశారు.
మొదటి విడత అధ్యక్ష పదవి చమన్ను వరించింది. మిగిలిన రెండున్నర ఏళ్లు నాగరాజు అధ్యక్ష పదవిని నిర్వహించాల్సి ఉంటుంది. చమన్ అధ్యక్ష పదవి చేపట్టి రెండేళ్లవుతోంది. ఒప్పందం ప్రకారం మరో ఆరు నెలల తర్వాత ఆయన దిగిపోవాలి. చమన్కు మంత్రి పరిటాల సునీత అండదండలున్నాయి. కాగా, నాగరాజును చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ గోవింద రెడ్డి బలపరుస్తున్నారు.
చమన్ ఆరు నెలల తర్వాత దిగిపోయేందుకు సిద్ధంగా లేరనే మాట వినిపిస్తోంది. నాగరాజు మాత్రం చమన్ దిగిపోవాల్సిందేనని అంటున్నారు. ఈ స్థితిలో పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు దాకా వస్తుందా, చూడాలి.