ప్రత్యేక ప్యాకేజీ విధి విధానాలేవీ?: కేంద్రానికి చిదంబరం ప్రశ్న, కీలక సవరణలకు ఏపీ డిమాండ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామంటూ చెబుతున్న కేంద్రం ప్రభుత్వం.. అందుకు తగిన విధి విధినాలను రూపొందించిందా? అని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశ్నించారు. ఇది ఇలావుంటే, ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీలన్నింటినీ విభజన చట్టంలో చేరుస్తూ సవరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
విభజన చట్టానికి ఐదు ముఖ్యమైన సవరణలు ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలపై అధ్యయనం చేస్తున్న పార్లమెంటరీ హోంశాఖ స్థాయీసంఘం శుక్రవారం పి చిదంబరం అధ్యక్షతన సమావేశమైంది. ఈ సమావేశంలోనే ఏపీ ప్రభుత్వ తన వాదనలు వినిపించింది. కాగా, స్థాయీ సంఘంలో సభ్యులుగా ఉన్న టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్నాయుడు, తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎంపీ బీబీపాటిల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ప్యాకేజీ విధి విధానాలేవి? ఎస్పీ మార్గదర్శకాలు?
విభజన సమస్యలపై చోటు చేసుకున్న పరిణామాల గురించి కుటుంబరావు వివరించారు. 27 పేజీల నివేదికను అందించారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో చిదంబరం ప్రతి అంశం గురించీ ఏపీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక, ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి విధివిధానాలు ప్రకటించారా? ఎస్పీవీ ఏర్పాటుకు మార్గదర్శకాలు జారీచేశారా? అని చిదంబరంప్రశ్నించగా.. కేంద్ర ఆర్థికశాఖ అధికారుల నుంచి సమాధానం కరవైనట్లు తెలిసింది.
జోన్, సీట్ల పెంపు.. ఏపీ అధికారుల వాదనలు
విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన పూర్తికాలేదని చెప్పినప్పుడు కారణాలను ఆరా తీశారు. దీనిపై తెలంగాణ అధికారులతో మాట్లాడి వారి అభిప్రాయాలుకూడా తెలుసుకుంటానని చెప్పినట్లు సమాచారం. విశాఖ రైల్వే జోన్, అసెంబ్లీ సీట్ల పెంపు, కృష్ణా, గోదావరి నదీయాజమాన్య మండళ్ల పరిధిని నోటిఫై చేయడం సహా కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలన్నిటినీ త్వరగా అమలు చేసేలా స్థాయీ సంఘం సిఫార్సు చేయాలని ఏపీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
హోదా సహా అన్ని హామీలు చట్టంలో..
రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చిన ప్రత్యేకహోదా సహా ఇతర హామీలన్నింటినీ విభజన చట్టంలో చేరుస్తూ సవరణ చేయాలి. అంతేగాక, విభజన చట్టంలోని సెక్షన్ 50, 51, 56 ప్రకారం పన్ను బకాయిలు, రీఫండ్ను జనాభా ప్రాతిపదికన విభజించేలా ఈ సెక్షన్లను సవరించాలి. దీంతోపాటు సింగరేణి కాలరీస్ ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదికనపంచేలా షెడ్యూల్-12లో సవరణలు చేయాలి.
అన్నీ కేంద్రమే భరించాలి..
ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు కల్పించిన పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఏపీకీ వర్తింపజేస్తూ సెక్షన్ 94(1), (2)ను సవరించాలి. ఏపీ రాజధానిలో అసెంబ్లీ, రాజ్భవన్, ముఖ్యమంత్రి బంగ్లా, మంత్రుల క్వార్టర్లు, సచివాలయం, ఉద్యోగుల గృహవసతి, ఇతర మౌలికవసతుల నిర్మాణానికి రూ.39,937 కోట్లు అవుతుందని అంచనా. ఈ మొత్తాన్ని పూర్తిగా కేంద్రమే భరించేలా సెక్షన్ 94(3)ను సవరించాలి. ఈ కీలక సవరణలను స్థాయీ సంఘం ముందుంచింది ఏపీ ప్రభుత్వం. స్థాయీ సంఘం సమావేశంలో ఏపీ ప్రభుత్వం తరఫున ప్రణాళికామండలి ఉపాధ్యక్షుడు సీహెచ్ కుటుంబరావు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రవిచంద్ర, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్, విభజన వ్యవహారాల కార్యదర్శి ప్రేమ్చంద్రారెడ్డి, ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ప్రకాశ్లు, కేంద్రం తరఫున హోం, ఆర్థిక, జలవనరులు, హెచ్ఆర్డీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.