విశాఖ:పార్ట్టైమ్ ఉద్యోగాల పేరిట మోసం...ఇదో రకం ఛీటింగ్
విశాఖపట్టణం: ఖాళీ సమయాల్లో పనిచేస్తూ అదనపు ఆదాయం ఆర్జించమంటూ ఊరించే మాటలతో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలను దారణంగా మోసగించి బోర్డు తిప్సేసిందో సంస్థ. అసలే ఆర్థిక ఇబ్బందులు...దానికి తోడు ఈ తరహా మోసంతో తమ పరిస్థితి మరింత దిగజారడంతో ఆందోళన చెందిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విశాఖపట్టణం నగరంలో చోటు చేసుకున్న ఈ ఉందంతం స్థానికంగా కలకలం రేపింది.
పత్రికల్లో, కరపత్రాల ద్వారా ఆకట్టుకునే ప్రకటనలు..."ఇంటి వద్దే ఉంటూ ఖాళీ సమయాల్లో పనిచేస్తూ అదనంగా డబ్బు సంపాదించండి"..."ఇలా విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు అదనపు ఆదాయం సంపాదించవచ్చు"...అంటూ ఆకట్టుకునే విధంగా ప్రకటనలు కుమ్మరించడంతో ఆర్థిక కష్టాలు కొంతైనా తీరతాయని నమ్మి ఆ సంస్థను ఆశ్రయించారు వందలాదిమంది...ఆ తరువాత షరామామూలే!...లక్షలు దండుకొని అడ్రస్ లేకుండా పోయారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
విశాఖ అల్లిపురం జైలురోడ్డులో కోల్కత్తాకు చెందిన ఎస్ఎస్ కమ్యూనికేషన్ పేరిట ఒక కార్యాలయం ప్రారంభించారు. నిరుద్యోగ యువత,గృహిణులు,చిరుద్యోగులు మా సహకారంతో పార్ట్ టైం వర్క్ చేసి అదనంగా వేలాది రూపాయల అదనపు ఆదాయం సంపాదించండి ఈ సంస్థ ముమ్మరంగా ప్రచారం చేసింది. ఈ సంస్థ ప్రచారం నమ్మి ఆసక్తితో ఎవరైనా ముందుకు రాగానే వారి నుంచి సెక్యూరిటీ డిపాజిట్ పేరిట రూ.6 వేల నుంచి రూ.40 వేల వరకు డిపాజిట్లు సేకరించేవారు.
ఈ డబ్బు మళ్లీ మీరు కోరుకున్నప్పుడు వెనక్కు తీసుకోవచ్చని...అంతవరకు తాము చూపించే ఆదాయ మార్గంతో నెలకు రూ.9 వేల నుంచి రూ.36 వేల వరకు సంపాదించుకోవచ్చని ఆశ చూపించారు. అలా ఆదాయం సంపాందించేందుకు రోజ్వాటర్ తయారీ, ఎల్ఈడీ ప్యానెల్స్, ఎల్ఈడీ స్ట్రిప్ లైట్లు, సీఎఫ్ఎల్ బల్బు తయారీ ఇలా వివిధ రకాల పనుల ద్వారా అదనపు ఆదాయం వస్తుందని, ఇవి చేసేందుకు అవసరమైన ముడి సరుకు తామే అందిస్తామని చెప్పారు.
వీరి మాటలు నమ్మి వందలమంది డబ్బులు కట్టినట్లు తెలుస్తుంది. వీరందరికి సంస్థ పేరిట రసీదులు కూడా ఇచ్చారు. అయితే డబ్బులు కట్టిన తరువాత ముడి సరుకు తీసుకునేందుకు మంగళవారం సంస్థ వద్దకు రమ్మని చెప్పివుండటంతో ఆ ప్రకారం అక్కడకి వెళ్లి చూసినవారికి సంస్థ మూసేసి ఉండటంతో గుండె గుభేల్ మంది. ఆ తరువాత సంస్థ ప్రతినిధుల ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది.
దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ విశాఖ మహరాణిపేట పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఎస్ కమ్యూనికేషన్ సంస్థ ఛీటింగ్ పై విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు అనకాపల్లిలో ఉన్నాడని బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు సిబ్బందిని అక్కడికి పంపించినట్లు పోలీసులు తెలిపారు.