'ఓటుకు నోటులో చంద్రబాబు పాత్ర, సుప్రీం కోర్టులో చెప్పిన స్టీఫెన్సన్'
అమరావతి: ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్థసారథి బుధవారం డిమాండ్ చేశారు. ఈ కేసు కారణంగా ఏపీ అన్ని విధాలా నష్టపోయిందన్నారు. ఈ కేసు కోసం చంద్రబాబు ఏపీని పణంగా పెట్టారని ఆరోపించారు.
చదవండి: ఓటుకు నోటులో ఏంలేదని కోర్టే చెప్పింది, ఏం చేస్తారో చూద్దాం, బాబుపై జగన్ కుట్ర: టీడీపీ షాకింగ్
ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. చంద్రబాబు పిరికిపందలా హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ కేసులో చంద్రబాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఓటు కొనేందుకు రూ.50 లక్షలు ఇప్పించారని, ఆపై ఆడియో టేపుల్లో వాయిస్ ఆయనదేనని తేలిందన్నారు.
చదవండి: ఓటుకు నోటు కేసు, ఇదీ అసలు విషయం!: 'చంద్రబాబును ఎవరూ ఏం చేయలేరు'
సీబీఐతో విచారణ జరిపించాలి
చంద్రబాబు రాజకీయాలను చూసిన తర్వాత ప్రజలకు రాజ్యాంగంపై నమ్మకం పోయిందని పార్థసారథి అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు ఏం చేయలేవనే ధీమాతో టీడీపీ నేతలు ఉన్నారని, రాజ్యాంగాన్ని ఖూనీ చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటుకు నోటు కేసులో సీబీఐ లేదా అత్యున్నత స్థాయి సంస్థతో విచారణ జరిపించాలన్నారు.
కేసీఆర్కు అడ్డంగా దొరికి పారిపోయారు
ఓటుకు నోటు కేసు చంద్రబాబు, రేవంత్ రెడ్డికి చెందిన సమస్య కాదని, రెండు రాష్ట్రాల సమస్య కూడా కాదని, ఈ కేసు కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని పార్థసారథి చెప్పారు. ఈ కేసులో చంద్రబాబు అడ్డంగా దొరకడం వల్లే కేసీఆర్కు భయపడి, ఆయనకు మోకరిల్లి పారిపోయి వచ్చారన్నారు. ఈ కేసు కారణంగా పదేళ్ల పాటు హైదరాబాదులో ఉండాల్సినప్పటికి వచ్చారన్నారు.
ఓటుకు నోటుతో ఏపీ ఎలా నష్టపోయిందంటే
ఓటుకు నోటు కేసు కారణంగా చంద్రబాబు ఇక్కడకు పారిపోయి వచ్చారని, దీంతో ఏపీ ప్రజలపై అనవసర భారం పడుతోందని పార్థసారథి అన్నారు. తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు కట్టినప్పటికీ అడ్డుకోలేకపోయారన్నారు. ప్రధానులుగా ఉన్న వారిపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా విచారణ చేశారని, అలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎందుకు విచారం చేయడం లేదన్నారు.
ఓటుకు నోటులో చంద్రబాబు పాత్ర, సుప్రీం కోర్టులో స్టీఫెన్ సన్
చంద్రబాబుకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని టీడీపీ నేతలు చెప్పడం సిగ్గుచేటు అని పార్థసారథి అన్నారు. ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉందని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ సుప్రీం కోర్టులో చెప్పారని గుర్తు చేశారు. సీబీఐ కేసు పెట్టి తనను అరెస్టు చేస్తుందనే భయంతో చంద్రబాబు నాలుగేళ్ల పాటు కేంద్రంలో బీజేపీతో జతకట్టిందన్నారు. రాజ్యాంగం అంటే చంద్రబాబుకు పిచ్చిరాతగా ఉందన్నారు. ఇతర పార్టీ ప్రజాప్రతినిధులను చంద్రబాబు కొంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం తనను ఏం చేయలేదని ఆయన భావిస్తున్నారన్నారు.