‘లోకేష్! తక్కువ చేసి మాట్లాడొద్దు: నయీమ్ను పోషించింది బాబే’
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నేత లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. షాద్నగర్లో పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీమ్ను పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీనేనని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
గురువారం పార్టీ కార్యాలయంలో పార్థసారధి మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ.. నయీమ్ లింకులన్నంటినీ ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాను టిడిపి నేత లోకేష్ తక్కువ చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ప్రత్యేక హోదాపై టిడిపి ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై ఢిల్లీలో ఒక మాట, ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారని అన్నారు.
ఢిల్లీకి 30సార్లు వెళ్లానని చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. ఏం సాధించి పెట్టారని నిలదీశారు. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
నయీమ్ను పెంచి పోషించింది చంద్రబాబే
గ్యాంగ్స్టర్ నయీమ్ను పెంచి, పోషించింది గత పాలకులు, చంద్రబాబేనని టిఆర్ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగా రెడ్డి ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించినందుకే నయీంను ఎన్కౌంటర్ చేశారన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. గతంలో నయీం తనను బెదిరించాడని రామలింగారెడ్డి చెప్పారు.
2004 ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఫోన్లో బెదిరించారని తెలిపారు. ఈ విషయంపై అప్పుడే సిద్దిపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. నయీమ్ సహకారం ఈ ప్రభుత్వానికి అవసరంలేదని రామలింగారెడ్డి చెప్పుకొచ్చారు.