భార్య డబ్బులకు లెక్కలు: జగన్ పార్టీ నేత పార్థసారథి
విజయవాడ: తన భార్య నుంచి హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.45 లక్షలకు సంబంధించి తన వద్ద అన్ని లెక్కలు ఉన్నాయని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం అభ్యర్థి కె.పార్థసారథి వెల్లడించారు. తన భార్యను నగదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యవహారంపై విజయవాడలో పార్థసారథి ప్రతిస్పందించారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం లోక్ సభ అభ్యర్థి రూ. 70 లక్షల వరకూ ఖర్చు పెట్టవచ్చని ఉన్నదని తెలిపారు. ఎన్నికల ఖర్చు కోసమే కార్పొరేట్ బ్యాంక్ నుంచి ఆ నగదును తన సతీమణి డ్రా చేసుకుని వస్తున్నారని వివరించారు.
మాజీ మంత్రి పార్ధసారథి సతీమణి కమల రూ.45 లక్షల తరలిస్తూ దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆమె ఈ డబ్బును ఆర్టీసీ బస్సులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదిలి పెట్టారు.
హైదరాబాద్ వనస్థలిపురంలో పార్థసారథి సతీమణి కమల ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు తనిఖీలు చేయగా ఈ నగదు లభ్యమైంది. కాగా మాజీమంత్రి పార్ధసారథి మచిలీపట్నం లోకసభ స్థానానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.