చంద్రబాబుది మోసం చేసే నైజం అని పార్ధసారధి ముందే చెప్పారు .. దేవినేని అవినాష్ తీవ్ర వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దేవినేని అవినాష్ చంద్రబాబును, టిడిపి నేతలను టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తనను మోసం చేశారని, చంద్రబాబు నాయుడు నైజం అలాంటిదేనని వైసిపి నేత పార్థసారథి చెప్పినప్పటికీ తాను పట్టించుకోలేదని పేర్కొన్నారు. మొత్తానికి చంద్రబాబుది మొదటనుండీ మోసం చేసే స్వభావం అని దుయ్యబట్టారు దేవినేని అవినాష్.
చంద్రబాబు మోసం చేస్తారని పార్ధసారధి ముందే చెప్పారన్న దేవినేని అవినాష్
తాను ఏ పార్టీలో ఉన్నా తన రాజకీయ భవిష్యత్ కోసం పార్థసారథి ఎన్నో సూచనలు చేసేవారని అవినాష్ గుర్తు చేసుకున్నారు. పెనమలూరు నియోజకవర్గాన్ని బోడె ప్రసాద్ పట్టించుకోకుండా గాలికి వదిలేశారని తీవ్ర విమర్శలు చేశారు దేవినేని అవినాష్ . పార్టీ కోసం ఎంతో కీలకంగా పనిచేసిన తనకు టిడిపిలో సరైన స్థానం దక్కలేదని ఆయన పేర్కొన్నారు. ఇక తాను ప్రత్యర్థిగా పోటీ చేసినప్పటికీ ఏది మనసులో పెట్టుకోకుండా కొడాలి నాని తనకు చాలా సహకరించారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు.
టీడీపీ నేతలను, చంద్రబాబును టార్గెట్ చేసుకుని అవినాష్ విమర్శలు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ నియోజకవర్గ ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి నేతలతో కలిసి పనిచేస్తానని అవినాష్ పేర్కొన్నారు. ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా అటు టిడిపి నేతలను, ఇటు చంద్రబాబును టార్గెట్ చేస్తూ దేవినేని అవినాష్ విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీకి రాజీనామా చేసి, వైసిపిలో చేరిన నాటి నుండి దేవినేని అవినాష్ చంద్రబాబును టార్గెట్ చేస్తూనే ఉన్నారు.
తనకు బాబు తీరని అన్యాయం చేస్తారని పలుమార్లు విమర్శలు
తనను కావాలని విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి కాకుండా గుడివాడ నుండి ఎన్నికల బరిలోకి దించి తన ఓటమికి కారణమయ్యారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడిని ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు దగ్గరనుండి ప్రతి ఒక్కరు నిలదీస్తున్నారు అని పేర్కొన్న దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీ నేతలు చాలామంది చంద్రబాబు తీరుతో తీవ్ర అసహనంతో ఉన్నారని ఆరోపించారు. ఇక రాజధాని రైతులు సైతం చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్న దేవినేని అవినాష్, చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయాలే పార్టీ భ్రష్టు పట్టడానికి కారణమని ఇప్పటికే పలుమార్లు విమర్శలు గుప్పించారు.
ఎవరికీ భయపడనంటున్న దేవినేని అవినాష్
టిడిపిలో ఉన్నంతకాలం టిడిపికి ఉపయోగపడ్డానని చెప్పిన ఆయన ఇప్పుడు వైసీపీలో స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పని చేస్తానని చెప్పారు. దేవినేని అవినాష్ టిడిపిలో ఉన్న సమయంలో తాను ఎలాంటి తప్పులు చేయలేదని, భూకబ్జాలు చేయలేదని, నేరారోపణలేవి తనపై లేవని పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న అందరు నాయకులను కలుపుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తానని చెప్తున్న దేవినేని అవినాష్ తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చంద్రబాబుపై మాత్రం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.