ఫ్యాషన్, రిజిస్ట్రేషన్ చేయకుండానే పార్టీ: జగన్పై బొత్స
హైదరాబాద్: పార్టీలు పెట్టడం ఫ్యాషనై పోయిందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన శనివారం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. పార్టీలు పెట్టడం ఫ్యాషనైపోయిందని, కొందరు డబ్బులు దండుకోవడానికే పార్టీలు పెడుతున్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బొత్స ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పార్టీలను ప్రైవేటు కంపెనీల్లా టేకోవర్ చేస్తున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేయకుండానే తన పార్టీని ప్రకటించారని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు వలసలు సహజమని, రాజకీయాల కోసం పార్టీ మారితే ప్రజలు ఛీకొడతారని అన్నారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కొందరు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర విభజన జరిగినా.. జరక్కపోయినా పార్టీ నుంచి వెళ్లేవారు వెళ్లిపోతారని ఆయన తెలిపారు. తాము జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులా అవాస్తవాలు మాట్లాడలేమని అన్నారు. ఆస్తులండబట్టే సింగపూర్ గురించి చంద్రబాబు ప్రమోట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాలం మార్పు తీసుకువస్తుందని.. మార్పు అభివృద్ధికి సూచకమని బొత్స అన్నారు. సీమాంధ్ర దేశంలో మెరుగైన ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పుట్టిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందా లేక పొత్తు పెట్టుకుంటుందా అనే విషయం కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని బొత్స సత్యనారాయణ చెప్పారు.