అఖిలపక్షం తర్వాతే: ట్రిబ్యునల్ తీర్పుపై సిఎం
హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించిన బ్రిజెష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం సచివాలయంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. వివిధ పార్టీలు చెప్పిన అభిప్రాయాలపై న్యాయ నిపుణులను సంప్రదిస్తామని ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి కోదండ రెడ్డి, మండలి బుద్ధ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నుంచి కోడెల శివప్రసాదరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కొణతాల రామకృష్ణ, శోభానాగిరెడ్డి, సిపిఐ తరపున నారాయణ, గుండా మల్లేష్, సిపిఎం నుంచి బివి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి తరపున విద్యాసాగర్ రావు, వినోద్ కుమార్, బిజెపి నుంచి నాగం జనార్ధన్ రెడ్డి, శేషగిరిరావు, లోక్ సత్తా పార్టీ నుంచి జయప్రకాష్ నారాయణ సమావేశంలో పాల్గొన్నారు.
ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకు వెళతాం: సుదర్శన్ రెడ్డి
కృష్ణా జలాల పంపిణీపై బ్రిజెష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ... సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అవసరమైతే రాష్ట్ర రైతుల పక్షాన కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామని, లేదా ప్రభుత్వం వేసే పిటిషన్లోనే ఆ అంశాలను కలుపుతూ వెళతామని అన్నారు. అడిషనల్ అడ్వకేట్స్ను ప్రభుత్వం తరపున ఏర్పాటు చేస్తామని సుదర్శన్ రెడ్డి తెలిపారు.