జగన్కు రివర్స్, ఇరుకునపడ్డ వైసీపీ: 'డబుల్' షాక్, వీటికి సమాధానం ఏది?
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం మరోసారి సంచలన ప్రకటన చేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే ఏప్రిల్ 5వ తేదీలోగా ప్రత్యేక హోదాపై న్యాయం జరగకుంటే తమ పార్టీ ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామా చేస్తారని చెప్పారు.
Recommended Video
చదవండి: 'మాకంటే చంద్రబాబు మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఇలానా', రోజా తీవ్ర ఆగ్రహం
ఈ ప్రకటన ఇప్పుడు టీడీపీని బెంబేలెత్తిస్తున్నట్లుగా ఉంది. కేంద్రమంత్రుల నుంచి ఆ పార్టీ ఎంపీల వరకు రాజీనామాలు చేయాలని జగన్ పరోక్షంగా ఒత్తిడి తెచ్చినట్లే. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాక్ట్స్ కమిటీకి కౌంటర్గా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారని అంటున్నారు.
చదవండి: జేసీకి బొత్స దిమ్మతిరిగే కౌంటర్, మేం సిద్ధం కానీ పవన్ కళ్యాణే తేల్చుకోవాలి
అదే జరిగితే జగన్కు డబుల్ షాక్
ఈ విషయాలను పక్కన పెడితే, ఏప్రిల్ 6న ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రాకుంటే, వైసీపీ ఎంపీలు రాజీనామా చేయకుంటే జగన్కు డబుల్ షాక్ తప్పదని అంటున్నారు. ఎందుకంటే గతంలోను తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు. కానీ బీజేపీతో అంతర్గతంగా చర్చల నేపథ్యంలో వేచిచూసే ధోరణి అవలంభించారు. ఇప్పుడు మరోసారి ప్రకటన చేశారు.
పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినందునే
తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీలు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం గతంలో రాజీనామా చేస్తానని చెప్పిన జగన్ తన ఎంపీలతో ఎందుకు ఇప్పటి వరకు చేయించలేదని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినందునే ఇప్పుడు మళ్లీ రాజీనామా అస్త్రాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు.
రాజీనామా చేస్తే ప్రశ్నించేవారు ఎవరన్నారు, మరి ఇప్పుడెలా
ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని చెప్పారు కదా అని వైసీపీ నేతలను ప్రశ్నించినప్పుడల్లా వారి నుంచి ఒకటే సమాధానం వచ్చింది. ప్రత్యేక హోదాపై టీడీపీ చిత్తశుద్ధితో పోరాడటం లేదని, ఇక మేం రాజీనామా చేస్తే పార్లమెంటు లోపల ప్రశ్నించే వారెవరని ఎదురు ప్రశ్నించారు. మరి ఇప్పుడు రాజీనామా చేస్తే ఇంతకుముందు వారు చెప్పిన దానికి ఏమని సమాధానం చెబుతారని అంటున్నారు.
వారిని కార్నర్ చేసేందుకేనా
ప్రత్యేక హోదా కోసం తాము కట్టుబడి ఉన్నామని చెప్పిన జగన్.. లోలోన బీజేపీతో చర్చలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి. బీజేపీతో పొసగదని గుర్తించి మరోసారి రాజీనామాను తెరపైకి తెచ్చారా లేక కేవలం చంద్రబాబు, పవన్ను కార్నర్ చేసేందుకే తీసుకు వచ్చారా అనేది తెలియాల్సి ఉంది. అయితే హోదా కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి... సరిగ్గా ఎన్నికలకు ముందు రాజీనామా అస్త్రాన్ని మరోసారి తెరపైకి తేవడం ఎందుకు అంటే అది కచ్చితంగా ఎన్నికల కోసమేననే వాదనలు వినిపిస్తున్నాయి.
జగన్ వద్ద సరైన సమాధానం లేదా
నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాపై టీడీపీ ఏం చేస్తుందనే ప్రశ్న వైసీపీ వేస్తే.. అది వారికి కూడా వర్తిస్తుందని అంటున్నారు. మిత్రపక్షంలో ఉండి ఇప్పటి వరకు సాధించే ప్రయత్నం చేశామని, ఓపిక పట్టామని టీడీపీకి చెప్పుకునేందుకు ఆస్కారం ఉందని, మరి జగన్ కూడా ఇన్నాళ్లు ఓపిక పట్టినట్లే కదా అని అంటున్నారు. ఆయన ఎందుకు వేచి చూశారనేందుకు సరైన సమాధానం మాత్రం ఆయన వద్ద లేదని అంటున్నారు.
ప్యాకేజీ ప్రకటించినప్పుడే అసలు ఛాన్స్
ప్రత్యేక హోదా విషయంలో వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే హోదా ఇవ్వమని, ప్యాకేజీ ఇస్తామని చెప్పినప్పుడే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించాల్సి ఉండెనని, కానీ ఆ తర్వాత బీజేపీతో కూడా చర్చలు జరిపి కేసులకు భయపడుతున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారని గుర్తు చేస్తున్నారు. అప్పుడే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించడం లేదా హోదాపై ఉద్యమిస్తే ఇప్పుడు రాజీనామా ప్రకటన నమ్మశక్యంగా ఉండేదని, కానీ గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను చూస్తే విశ్వసించేదిగా లేదనేది టీడీపీ వాదన.