అంతర్వేది రథం ఇష్యూ: కారకర్తలు, బీసీ, ఎస్సీలపై దాడుల తర్వాత.. నమ్మి ఓట్లు వేస్తే..
అంతర్వేది రథం దగ్దం ఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు. ఘటనపై స్వామి పరిపూర్ణానంద స్వామి కూడా స్పందించారు. ఇటు తెలంగాణ బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సమగ్ర దర్యాప్తు జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విధ్వంసం, వినాశనం..
విధ్వంసం, వినాశనం, దాడులు, దౌర్జన్యాలు అధికార వైసీపీ లక్ష్యాలు అని చంద్రబాబు విమర్శించారు. తొలుత టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేశారని పేర్కొన్నారు. తర్వాత బీసీలపై.. ఎస్సీలపైనా దౌర్జన్యాలకు తెగబడ్డారని ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా ఆలయాలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మంత్రులను నిలదీసిన వరద బాధితులు..
నియంతలందరూ కాలగర్భంలో కలిసిపోయారని చంద్రబాబు గుర్తుచేశారు. వరద బాధితుల పునరావాసంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. మంత్రులను వరద బాధితులు నిలదీయడం ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ఠ అని విమర్శించారు. మరోవైపు రాష్ట్రంలో హిందువులకు అన్యాయం జరుగుతోందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీఎం జగన్ స్పందించాలని స్పష్టం చేశారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. రథం దగ్ధం వెనుక కుట్ర దాగివుందని ఆరోపించారు.
చులకన మాట్లాడటం భావ్యం కాదు..
అంతర్వేది ఘటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆలయాలపై దాడులు పెరిగాయని తెలంగాణ బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. రథం దగ్ధం ఘటనపై మంత్రులు చులకనగా మాట్లాడుటం సరికాదన్నారు. రథం దగ్ధం ఘటనపై సీఎం జగన్ వెంటనే స్పందించాలని ఎన్వీఎస్ఎస్ అన్నారు.