నీళ్లు లేవని ప్రయాణికుల రైల్లో దాడి: టిటిఈ మృతి
హైదరాబాద్: రాష్ట్రంలోని కర్నూలు జిల్లా గుంతకల్ రైల్వే డివిజన్లో దిగ్ర్భాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఏసి కంపార్ట్మెంటు రైలులో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు కంపార్ట్ మెంటులో నీళ్లు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసి టికెట్ పరిశీలనకు వచ్చిన టిటిఈ(ప్రయాణం టికెట్ పరిశీలకుడు)పై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని మంత్రాలయం రైల్వే స్టేషన్లో గురువారం ఉదయం జరిగింది.
హత్యకు గురైన టిటిఈ అనంతపురం జిల్లాలోని ధర్మవరం పట్టణానికి చెందిన సంజీవయ్య(50)గా గుర్తించారు. చెన్నైలో బయలుదేరిన ఆ రైలు బెంగళూరు, ధర్మవరం, గుంతకల్లు మీదుగా మహారాష్ట్రలోని షిర్డీ పట్టణానికి వెళుతుంది. రైలులోకి ప్రవేశించిన టిటిఈని ఓ ప్రయాణికుడు నీళ్లు రావడం లేదని ఫిర్యాదు చేయడంతో గొడవ మొదలైంది.
నీటి విషయమై కొందరు ప్రయాణికులు టిటిఈతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో రైలును గుంతకల్ స్టేషన్లో ఆపేశారు. అయితే గుంతకల్లు స్టేషన్ ప్లాట్ ఫాంపై నీళ్లు నింపే వసతి లేకపోవడంతో తర్వాత వచ్చే మంత్రాలయం స్టేషన్లో రైలులో నీళ్లు నింపుతామని రైల్వే ఉద్యోగులు హామీ ఇచ్చారు.
అయితే మంత్రాలయంలో కూడా రైలు కంపార్ట్ మెంటులో నీరు నింపకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కొందరు ప్రయాణికులు టిటిఈపై దాడికి దిగారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడ్డ టిటిఈ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. నిందితులపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు బాధ్యులుగా బెంగళూరుకు చెందిన వంశీకృష్ణ, చెన్నైకి చెందిన అమరేష్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు గుంతకల్లు రైల్వే డివిజన్ డిఎస్పి సుదర్శన్ తెలిపారు.