కడప విమానాశ్రయం:ప్రయాణికులతో కళకళ...త్వరలో బెంగుళూర్ సర్వీస్
కడప:కడపలో విమానాశ్రయం ఉందా?...ఉన్నాపనిచేస్తుందా?...అని ప్రశ్నిస్తే సమాధానం కోసం తడుముకునే పరిస్థితి చాలా మంది ఆంధ్రావాసులది. అయితే...అలాంటి కడప విమానాశ్రయం ఇప్పుడు ప్రయాణికుల రాకపోకలతో కిక్కిరిసిపోతుందంటే నమ్మగలరా...నమ్మాలి తప్పదు...ఎందుకంటే?
మిగిలిన జిల్లావాసుల సంగతేమో కాని కడప జిల్లా వాసులకు మాత్రం ఈ విమానాశ్రయం ఇప్పుడు బాగా అక్కరకొస్తున్నట్లు ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన ప్రయాణికుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. గడచిన రెండేళ్లలో కడప విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య ఎంత శాతం పెరిగిందో తెలుసా!...400 శాతం...ఆశ్చర్యంగా ఉన్నాఇది నిజం. మరింతగా విమాన ప్రయాణాలు పెరగడానికి కారణఆలు ఏమై ఉండొచ్చో...ఇప్పుడు తెలుసుకుందాం!
కడప విమానాశ్రయం...అప్పుడు...
కడపలో 1953 నుంచి విమానాశ్రయం ఉంది. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. అయితే అన్నేళ్లనుంచి ఉన్నా ఈ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు మాత్రం పూర్తిస్థాయిలో లేవు. దీనితో కడపలో అన్ని సౌకర్యాలతో విమానాశ్రయాన్ని నిర్మించాలని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్న సమయంలో ఒకేసారి రూ. 33 కోట్లను ఒకే విడతగా విడుదల చేశారు. దీంతో 1060 ఎకరాల్లో కడప విమానాశ్రయం నిర్మించేందుకు ప్రణాళిక సిద్దం చేశారు. ఆ క్రమంలో రెండు విడతల్లో విమానాశ్రయం నిర్మాణపు పనులు చేపట్టారు. అలా ఆధునీకరించిన ఈ విమానాశ్రయం 2015 జూన్ 7 న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించబడి మరలా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది.
కడప...విమాన ప్రయాణాలు...ఇప్పుడు
ఒకప్పుడు ఎన్ఆర్ఐలు,విదేశీ విద్య,ఉన్నతోద్యోగులు మాత్రమే ఈ జిల్లా నుంచి విమాన ప్రయాణాలు సాగించేవారు. అయితే ఇటీవలి కాలంలో ఈ పరిస్థితిలో భారీగా మార్పు చోటు చేసుకున్నట్లు ప్రయాణికుల రాకపోకల గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇందుకు కారణం ఇప్పుడు డబ్బు విలువ కంటే సమయం విలువే ఎక్కువని భావిస్తుండటం, అలాగే టికెట్ల ధరలు కూడా అందుబాటులోకి రావడంతో సంపన్న వర్గాలే కాదు మధ్యతరగతి ప్రజలు కూడా విమాన ప్రయాణానికి మొగ్గుచూపుతున్నారు. వందలాది కిలోమీటర్లు రోజుల తరబడి ప్రయాణించేకంటే గంటల్లో గమ్యాన్ని చేరుకునే ఈ ప్రయాణమే మేలని భావిస్తున్నారు. అందుకే రెండేళ్ల కిందట ఈ విమానాశ్రయం నుంచి వందల సంఖ్యలో మాత్రమే ఉండే విమాన ప్రయాణికుల సంఖ్య నేడు వందల రెట్లు పెరిగి వేలల్లోకి చేరింది.
సమయం ఆదా...ధరలూ అనుకూలమే
కడప విమానాశ్ర యాన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్టుగా మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఏటీఆర్-72 సర్వీసులు మాత్రమే నడుస్తాయి. ఏటీఆర్-72 రకం విమానాల్లో 75 మంది ప్రయాణీకులకు మాత్రమే సౌకర్యం ఉంటుంది. బోయింగ్, ఎయిర్ బస్సులు నడిపేందుకు కడప ఎయిర్పోర్టు రన్వే అనుకూలించదు. ఈ కారణంగా ప్రస్తుతం కడప జిల్లా నుంచి విజయవాడ, హైదరాబాద్, చెన్నై నగరాలకు మాత్రమే విమానాల రాకపోకలు సాగుతున్నాయి. ఈ మూడు నగరాలకు బస్సు ప్రయాణం ద్వారా చేరుకోవాలంటే కనీసం 10 గంటలు...అదే రైలులో వెళ్లాలంటే దాదాపు 14 గంటలవరకు సమయం పట్టొచ్చు. అయితే ఇదే నగరాలకు విమాన ప్రయాణమైతే కేవలం ఒక గంట మాత్రమే!...అందువల్ల ఈ నగరాలకు విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. మరోవైపు విమానం టికెట్ల ధరలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ట్రైన్ ఫస్ట్ క్లాస్ ఏసీ టిక్కెట్ ధరకే విమాన ప్రయాణం ద్వారా గమ్యానికి చేరుకునే అవకాశం దక్కుతుండటం కూడా ప్రయాణికుల సంఖ్య బాగా పెరగడానికి కారణమని చెప్పుకోవచ్చు.
ప్రత్యేక సమయాల్లో...ప్రత్యేక తగ్గింపులు
ప్రస్తుతం కొన్ని ప్రత్యేక సందర్భాలు ఎంచుకుంటే సామాన్యులు కూడా విమాన ప్రయాణం చేయవచ్చని ఏజంట్లు చెబుతున్నారు. ఉడాన్ పథకంలో టికెట్ బుక్ చేసుకున్నవారు అతి తక్కువ ధరలోనే ప్రయాణం చేయవచ్చని అంటున్నారు. అలాగే పండుగ సమయాల్లో కూడా తక్కువ ధరకే విమానంలో ప్రయాణించి అవకాశం లభిస్తుందని, అలాంటి సమయాల్లో సాధారణ టికెట్పై 50 శాతం పైగానే తగ్గింపు ఉంటుందని తెలిపారు. అలాగే విమాన టికెట్ ధరలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవని, కాలానుగుణంగా హెచ్చుతగ్గులు ఉంటాయని, వాటిని గమనిస్తూ తక్కువ ధరకు టికెట్ చేజిక్కించుకోవచ్చని వివరించారు. అలాగే వారాంతాల్లో విమాన ధరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి...15 రోజుల ముందే టిక్కెట్ బుక్ చేసుకుంటే తక్కువ ధరకే విమన ప్రయాణం చేయవచ్చని చెబుతున్నారు.
త్వరలో...బెంగుళూర్ సర్వీస్ కూడా
అంతేకాదు కడప ఇటీవలి కాలంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు విద్య, వైద్య రంగాల్లో కూడా మంచి పురోగతిని సాధించడంతో విమానసౌకర్యం వినియోగించుకునేవారి సంఖ్య అధికమైంది. ప్రజాప్రతినిధులు, వైద్య ప్రముఖులు, యూనివర్శిటీ ప్రొఫెసర్లు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతోద్యోగులు, వ్యాపారులు...వీరందరికీ కడప విమానాశ్రయం అత్యంత అనువుగా ఉందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు కడప నుంచి విజయవాడ, హైదరాబాదు, చెన్నైలకు మూడు సర్వీసులు నడుస్తుండగా తాజాగా మరో విమాన సర్వీసును బెంగళూరుకు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు కడప ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం ప్రయాణికుల రాకపోకల సంఖ్య లక్షకు చేరుకొంటుందని వారు ధీమా వ్యవక్తం చేస్తున్నారు.