కలకలం:వివాహితపై పాస్టర్ అత్యాచార యత్నం...అరెస్ట్
పశ్చిమ గోదావరి జిల్లా:అతడో పాస్టర్...దేవుని వాక్యాలు బోధిస్తూ ప్రజలు పాపం చేయరాదని హితవు పలకాల్సిన ఆ మత బోధకుడే కామాంధుడయ్యాడు. వివాహిత ఒంటరిగా ఉండటం చూపి కాటేయబోయాడు.
అయితే ఈ కీచక పాస్టర్ చర్యలతో ఖంగతిన్న ఆ మహిళ పెద్దగా కేకలు వేయడంతో ఘోరమైన నీచానికి ఒడిగట్టిన ఆ పాస్టర్ పారిపోయాడు. దీంతో పాస్టర్ నిర్వాకం తెలిసిన స్థానికులు ఆ పాస్టర్ కు చెందిన చర్చి మీద దాడిచేసారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాలు ఇవి...
పశ్చిమ గోదావరి జిల్లాలోని గణపవరంకు చెందిన సందాడి మనష్షే అనే వ్యక్తి సీహెచ్ అగ్రహరం గ్రామంలో చర్చ్ పాస్టర్గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి సమయంలో ప్రార్థన చేసేందుకని సీహెచ్ అగ్రహరంలోనే ఒక వివాహిత ఇంటికి అతడు వెళ్లాడు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించిన పాస్టర్ ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో భయపడిన ఆమె ఒక్కసారిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకుంటూ వచ్చారు.
ఆమె విషయం చెప్పడంతో స్థానికులు పాస్టర్ ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే పాస్టర్ అక్కడనుంచి తప్పించుకొని పారిపోయాడు. దీంతో ఆగ్రహం చెందిన స్థానికులు ఆ పాస్టర్ కు చెందిన చర్చిపై దాడి చేశారు. అందులోని ఫర్నిచర్ను తగలబెట్టి కొన్ని గంటలపాటు గ్రామంలో విధ్వంసం సృష్టించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని స్థానికులను శాంతింపజేశారు. వారికి నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించివేశారు.
అనంతరం బాధితురాలు పాస్టర్ పై పోలీసలకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు పాస్టర్ను అరెస్టు చేశారు. మరోవైపు రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలతో అట్టుడుకుతున్నా ఈ తరహా కీచకరాయుళ్లు ఇంత ధైర్యంగా ఈ తరహా ఘటనలకు పాల్పడతుండటం గమనార్హం.