జగన్కు శిక్ష తప్పదు, వైయస్ లాగే..: పాస్టర్ తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి/తిరుపతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఓ క్రిస్టియన్ పాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తన పాదయాత్రను ప్రారంభించడానికి ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామంపై కొందరు క్రిస్టియన్ పాస్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శిక్ష తప్పదు..
కాగా, విగ్రహారాధన చేసిన జగన్ని జీసస్ కచ్చితంగా శిక్షిస్తాడని తిరుపతికి చెందిన పాస్టర్ డేవిడ్ కరుణాకరన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అయింది.
తిరుపతి చర్చిలో ఇటీవల ఆయన ఇచ్చిన సందేశం సంచలనాత్మకంగా మారింది. ఈ మేరకు తెలుగు మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి.
ఉగ్రతను చూడకతప్పదు..
ఆ సందేశంలో డేవిడ్ కరుణాకరన్ మాట్లాడుతూ.. ‘ఎంత విచారకరమంటే... కొండ మీదకు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఆయన (జగన్) ఏమన్నారంటే.. పాదయాత్ర ప్రారంభించడానికి ముందు ఆయన (శ్రీవెంకటేశ్వరుడు) ఆశీర్వాదం ఉంటే బాగుంటుందని వచ్చాడంట!... ఆయన పశ్చాత్తాపం పొంది విగ్రహారాధనను విడిచిపెడితే దేవుడు(జీసస్) కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తాడు.. ఆయన పశ్చాత్తాప పడకుండా విగ్రహారాధన చేస్తుంటే మాత్రం దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క ఆగ్రహంను, దేవుని యొక్క కోపంను.. ఆయన జీవితంలో చూడాల్సి వస్తుంది...' అని ఆ ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు.
వైయస్ లాగే..
దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోవడానికి కారణం నాడు విగ్రహారాధన చేయడమేనని పాస్టర్ డేవిడ్ కరుణాకరన్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వైయస్ జగన్ కూడా అదే విగ్రహారాధన బాటలో నడుస్తున్నాడని అన్నారు. ఏసుకు ఈ పరిణామంతో జగన్పై కోపం వస్తుందని అన్నారు. జగన్కు జ్ఞానం రావాలని, ఆయన కోసం మనం ప్రార్థన చేయాలని పిలుపునిచ్చారు.
అలా అనలేదే..
కాగా, ఈ విషయమై పాస్టర్ డేవిడ్ కరుణాకరణ్ను వివరణ కోరగా..‘విగ్రహారాధన చేయొద్దని ఏసు ప్రభు ప్రత్యేకించి చెప్పలేదు. ‘గ్రహారాధన వల్లే వైఎస్ రాజశేఖరరెడ్డి గారు చనిపోయారేమో!' అని అన్నాను తప్పా, ‘చనిపోయారు' అని నేను చెప్పలేదు. హిందూ దేవుళ్లను నేను ఎప్పుడూ కించపరచ లేదు.. కించపరచను కూడా. నాలుగు రోజుల క్రితం నేను చర్చిలో చేసిన ప్రసంగం కేవలం క్రైస్తవుల కోసమే. మనందరం భారతీయులం' అని చెప్పుకురావడం గమనార్హం.