పాస్టర్ చేతిలో యువతి దారుణ హత్య:వివాహేతర సంబంధమే కారణం
కడప జిల్లా:మత బోధకుడిగా నలుగురికి నీతి వ్యాక్యాలు బోధించే ఒక పాస్టర్ తానే కామాంధుడిలా మారి ఒక వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అతడి పతనం అంతటితో ఆగలేదు...
ఆ తరువాత ఆమె వేరొకరితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో మృగాడిలా మారి ఆమెని దారుణంగా హతమార్చాడు. కడప జిల్లా బోయనపల్లెలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానకంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే...
పోలీసుల కథనం ప్రకారం...బోయనపల్లె దళితవాడకు చెందిన వర్ల సుబ్బరాయుడు కొంత కాలంగా అదే పల్లెలోని యేసుక్రీస్తు చర్చికి పాస్టర్గా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇతడికి చర్చికి సమీపంలోనే నివసించే కొమ్మి ఇందిర(30) అనే యువతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ ఇందిర అనే మహిళకు పదేళ్ల క్రితం చెంగయ్య అనే వ్యక్తితో వివాహం కాగా వీరికి సంతానం కలగలేదు. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం ఇందిరకు పాస్టర్ సుబ్బారాయుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఇదిలావుంటే ఇందిర అక్క,బావ కువైట్ లో ఉండగా వారు తమ పిల్లలను ఇందిర,చెంగయ్య దంపతుల వద్దే వదిలి వెళ్లారు. వారు కువైట్ నుంచి డబ్బులు పాస్టర్ అకౌంట్ కు పంపగా అతడు ఇందిరకు ఇచ్చేవాడని తెలిసింది. అక్క, బావ కువైట్కు వెళ్లి డబ్బులు కూడా పాస్టర్ అకౌంట్కు పంపించే వారన్నారు.
ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున పాస్టర్ సుబ్బరాయుడు ఇందిర ఇంట్లోకి దొంగచాటుగా ప్రవేశించి తలుపుకు లోపలినుంచి గడియ పెట్టి నువ్వు నాతో కాకుండా వేరొకరితో ఎందుకు మాట్లాడుతున్నావని గొడవ పడినట్లు తెలిసింది. ఆ తర్వాత గొడవ పెద్దదవడంతో అతడు ఇందిర మెడను చేతితో పట్టుకొని చంపడానికి ప్రయత్నించాడని, దీంతో అదే గదిలో ఉన్న ఇందిర అక్క పిల్లలు చూసి అరవగా వారిని కూడా వెనక్క నెట్టి ఇందిరను చంపేశాడన్నారు. దీంతో చిన్నారులు పెద్దపెద్దగా కేకలు వేస్తుండటంతో మిద్దెపైన నిద్రిస్తున్న ఇందిర భర్త చెంగయ్య, స్థానికులు తలుపులు పగలగొట్టి చూస్తే ఇందిర చనిపోయి పడి ఉందన్నారు.
ఆ తర్వాత పాస్టర్ సుబ్బరాయుడు అక్కడ నుంచి పరారై తదనంతరం మన్నూరు పోలీసులకు లొంగిపోయినట్లు నట్లు చెబుతున్నారు. అయితే హత్య తాను చేసినట్లు చెప్పకుండా ఎవరో హత్య చేసినట్లు పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. దీంతో హత్య విషయం తెలిసి సంఘటనా స్థలాన్ని రాజంపేట డీఎస్పీ లక్ష్మీ నారాయణ, సీఐ నరసింహులు, ఎస్ఐ మహేష్ సందర్శించి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట మార్చురీకి తరలించి మన్నూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే ఇందిరను తానే చంపేసిన ఫాస్టర్ సుబ్బారాయుడు ఈ హత్యను పార్ధీ గ్యాంగ్ చేసిందన్న చందంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని డీఎస్పీ తెలిపారు.