YSR Congress Party: వైసీపీతో టచ్ లో ఉన్న మాజీమంత్రి: జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం.. !
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మాజీమంత్రి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కోసం ఆయన వేచి ఉన్నారు. ఆయన చేరికకు వైఎస్ జగన్ అంగీకారాన్ని వ్యక్తం చేస్తే.. మరుక్షణమే వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనే పసుపులేటి బాలరాజు. జనసేన పార్టీ మాజీ నాయకుడు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ ను నిర్వహించిన రోజే.. పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నారు. వైసీపీ నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడితే.. బీజేపీలో చేరవచ్చని తెలుస్తోంది.
వైఎస్ అనుచరుడిగా..
పసుపులేటి బాలరాజు చాలాకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అనుచరుడిగా ఆయనపై ముద్ర ఉండేది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఆయన మంత్రివర్గంలో పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో బాలరాజు కాంగ్రెస్ లో ఉండిపోయారు. వైఎస్ జగన్ కాంగ్రెస్ ను ఎదురు తిరిగి, కొత్త పార్టీని ప్రకటించిన తరువాత ఆయనపై ఘాటు విమర్శలు చేశారు. వ్యక్తిగతంగా విమర్శించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
కాంగ్రెస్ లో కొనసాగలేక..
రాష్ట్ర విభజన అనంతరం కూడా ఆయన కొద్దిరోజుల పాటు కాంగ్రెస్ లోనే కొనసాగారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, వైసీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ దాదాపు పతనావస్థకు చేరుకున్న నేపథ్యంలో.. రాజకీయంగా ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ ను వీడారు. పవన్ కల్యాణ్ సారథ్యం వహిస్తోన్న జనసేన పార్టీలో చేరారు. ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి పరాజయాన్ని చవి చూశారు. జనసేన పార్టీ సైతం ఆశించిన స్థాయిలో నిలదొక్కుకోలేదని భావించిన ఆయన ఆ పార్టీని కూడా వీడారు.
వైసీపీలో చేరడానికి సుముఖంగానే ఉన్నా..
అధికార వైఎస్సార్సీపీలో చేరడానికి బాలరాజు సుముఖంగానే ఉన్నప్పటికీ.. ఇదివరకు వైఎస్ జగన్ పై చేసిన ఘాటు విమర్శలు అడ్డుగా నిలుస్తున్నాయని చెబుతున్నారు. వైఎస్ జగన్ కాంగ్రెస్ ను వీడిన సమయంలో పార్టీకి వ్యక్తిగత విమర్శలు చేసిన ప్రభావం ఇప్పుడు చూపుతోందని అంటున్నారు. వైఎస్ జగన్ ను సీబీఐ అరెస్టు చేయడం, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై ఆయనను జైలులో ఉంచడం వంటి సమయంలో బాలరాజు మంత్రిగా ఉన్నారు. వైఎస్ జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీని అధ్యక్షురాలిగా, శాసనసభ్యురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మపైనా విమర్శలు చేశారాయన. అవన్నీ ఇప్పుడు ప్రతికూలంగా ఉన్నాయని అంటున్నారు.
వైసీపీ కాదంటే..
గతంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ పై చేసిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ నాయకులు బాలరాజు చేరికను నిరాకరిస్తే.. ప్రత్యామ్నాయ పార్టీని వెదుక్కునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇందులో భాగంగా ఆయన భారతీయ జనతాపార్టీలో చేరొచ్చని తెలస్తోంది. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.ఇదివరకు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేశారు. ఒకే సమయంలో మంత్రివర్గంలో కొనసాగారు. ఆ సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో- బాలరాజు వైసీపీ కాదంటే బీజేపీలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. తొలి ప్రాధాన్యత మాత్రం ఆయన వైసీపీకే ఇచ్చారని అంటున్నారు.