లాంగ్మార్చ్ ముందు పవన్ కళ్యాణ్కు షాక్: జనసేనకు సీనియర్ నేత బాలరాజు గుబ్బై
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు మరో షాక్ తగిలింది. జనసేన పార్టీకి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. కాగా, ఎన్నికలకు కొద్ది రోజుల ముందే బాలరాజు పార్టీలో చేరడం గమనార్హం.
పవన్ మార్చ్ లో గంటా పాల్గొంటారా..! ఇరకాటంలో మాజీ మంత్రి: ఏం చేయబోతున్నారు..!
తప్పనిసరి పరిస్థితుల్లోనే..
ఐదు నెలలపాటు పార్టీలో కొనసాగానని.. అందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలని పవన్ కళ్యాణ్కు లేఖలో పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీని వీడాల్సి వచ్చిందని పసుపులేటి బాలరాజు స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే జనసేన పార్టీకి పలువురు సీనియర్ నేతలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణ, చింతలపూడి వెంకట్రామయ్య, పార్థసారథి ఇప్పటికే జనసేన పార్టీని వీడారు. తాజాగా పసుపులేటి బాలరాజు కూడా జనసేనకు రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
లాంగ్ మార్చ్ ముందు పవన్ కళ్యాణ్ షాక్
గత ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యేగా విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు పసుపులేటి బాలరాజు. అయితే కొంతకాలంగా జనసేన పార్టీకి ఆయన దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. నవంబర్ 3న జనసేన విశాఖలో నిర్వహించ తలపెట్టిన లాంగ్ మార్చ్ నేపధ్యంలో పసుపులేటి బాలరాజు రాజీనామా చేయడం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, జనసేన చేపట్టిన లాంగ్ మార్చ్ నిర్వహణ కోసం విశాఖలో ఏర్పాట్లపై నాదెండ్ల మనోహర్, నాగబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూడా బాలరాజు పాల్గొనకపోవడం గమనార్హం.
ఏ పార్టీలో చేరతారో..
ఇసుక కొరత నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం, నవంబర్ 3న విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆదివారం విశాఖలో లాంగ్ మార్చ్ ఉన్న నేపధ్యంలో ముందు ముందు రోజే కీలక నేత రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, బాలరాజు ఏ పార్టీలో చేరతారనేది తెలియాల్సి ఉంది.
మంత్రిగా చేసి.. పవన్ ఓటమితో..
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారు బాలరాజు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన జనసేన పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీతోపాటు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి చవిచూడటంతో బాలరాజు పార్టీపై కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.