పడవ మునక: మహిళతోపాటు మరో బాలిక మృతదేహం లభ్యం, సెర్చ్ ఆపరేషన్ కొనసాగింపు
యానాం: తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద శనివారం పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతైన వారి కోసం సోమవారం కూడా గాలింపు కొనసాగుతోంది. గల్లైంతనవారిలో ఆదివారం ఓ మహిళ మృతదేహం లభ్యం కాగా.. మిగిలిన ఆరుగురు విద్యార్థినుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మృతురాలిని ఐ.పోలవరం మండలం శేరిలంకకు చెందిన నాగమణి(30)గా అధికారులు గుర్తించారు.
హెలికాప్టర్లతోనూ విస్తృతంగా గాలింపు
గల్లంతైన ఆరుగురు విద్యార్థినుల ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు గోదావరి నదిని జల్లెడ పడుతున్నారు. విశాఖలోని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటోంది. నేవీ హెలికాప్టర్ యూహెచ్-3హెచ్ సేవలు కూడా సహాయసిబ్బంది వినియోగించుకుంటున్నారు.
వర్షం తగ్గడంతో గాలింపు ముమ్మరం
సోమవారం వర్షం కొంత తగ్గుముఖం పట్టడంతో గాలింపు ముమ్మరం చేశారు. ఆదివారం రాత్రి కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మత్స్యకారులు నదిలో గాలింపు చేపట్టారు. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా యానాం వద్ద పరిస్థితిని సమీక్షించారు.
గోదావరిలో నాటు పడవ బోల్తా: ఆరుగురు విద్యార్థినుల గల్లంతు, పిల్లర్కు ఢీకొనడంతోనే
వరద ఉధృతి పెరగడంతో..
కాగా, ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో యానాం వద్ద వరద ఉద్ధృతి కొం తపెరిగింది. ఇది సహాయచర్యలకు ప్రతికూలంగా మారింది. ఈ ప్రాంతానికి సముద్రం అతి సమీపంలో ఉండటంతో ఆటుపోట్లు ఏర్పడి గాలింపునకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున మృతదేహాలు పైకి తేలకుండా సముద్రంలోకి వెళ్లిపోయి ఉంటాయని స్థానిక మత్స్యకారులు అంటున్నారు. ఈ క్రమంలో అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కాకుండా పది కిలోమీటర్ల దిగువన బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టారు.
సోమవారం ఓ బాలిక మృతదేహం లభ్యం
ప్రమాదం జరిగి రెండ్రోజులు అవుతున్నందున సోమవారం మృతదేహాలు పైకి తేలే అవకాశం ఉందని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప అభిప్రాయపడ్డారు. మృతదేహాలు సముద్రంలోకి వెళ్లిపోకుండా ఆ ప్రాంతంలో నాటు పడవలతో మత్స్యకారులు గాలింపు చేపడుతున్నారని తెలిపారు. సహాయచర్యల్లో ఎన్టీఆర్ఎఫ్, నేవీ, గజ ఈతగాళ్లు, స్థానిక మత్స్యకారులు చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. కాగా, సోమవారం ఓ బాలిక మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిసింది. ఆ బాలికకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.