అనుష్క హానీ ట్రాప్: సీసీఎస్ కస్టడీకి సుబేదార్ పతన్
హైదరాబాద్: భారత ఆర్మీ రహస్యాలను బయటకు చెప్పిన సుబేదార్ పతన్ కుమార్కు నాంపల్లి క్రిమినల్ కోర్టు సిసిఎస్ కస్టడీకి ఇచ్చింది. పతన్ను వారం పాటు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సిసిఎస్) పోలీసుల కస్టడీకి ఇస్తూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. తిరిగి ఈనెల 19న వైద్య పరీక్షలు నిర్వహించి పతన్ను కోర్టుకు అప్పగించాలని పేర్కొంది.
తన తరపు న్యాయవాది సమక్షంలోనే పోలీసులు పతన్ను విచారించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. సిసిఎస్ పోలీసుల కస్టడీ పిటిషన్పై సోమవారం నాంపల్లి క్రిమినల్ కోర్టు విచారణ చేపట్టింది. పతన్ను కస్టడీకి అప్పగించేందుకు ఆర్మీ అధికారుల అనుమతి తీసుకున్నారా? అని న్యాయమూర్తి సిసిఎస్ పోలీసుల తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. ఆర్మీ అనుమతితో రావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
మధ్యాహ్నం ఆర్మీ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నట్టు సిసిఎస్ పోలీసులు మెమో దాఖలు చేయడంతో కోర్టు పతన్ను కస్టడీకి అనుమతి ఇచ్చింది. పతన్ను సిసిఎస్ కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో కేసుకు సంబంధించి మరింత కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సేకరించిన సమాచారం ఆధారంగా సిసిఎస్ పోలీసులు ప్రాథమిక విచారణ మొదలుపెట్టారు.
కాగా పతన్ను వారం రోజులు కస్టడీకి ఇచ్చిన ఇవ్వడంతో.. పతన్ చెప్పిన వివరాలే కాకుండా ఇంకేమైనా దాస్తున్నాడా? అన్న కోణంలో పోలీసులు విచారించే అవకాశం ఉంది. అదేవిధంగా పాక్ గూఢాచారి అనుష్క అగర్వాల్తో కేవలం ఆన్లైన్లోనే పరిచయమా? ఇద్దరు నేరుగా ఏమైనా కలుసుకున్నారా? వివిధ కోణాల్లో విచారించే అవకాశాలున్నాయి. పతన్ కంప్యూటర్, ల్యాప్ట్యాప్, మొబైల్ ఫోన్లు, పెన్డ్రైవ్లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.