త్వరలో రాందేవ్ బాబా జీన్స్, ఏపీలో ప్లాంట్: పాకిస్తాన్కూ పతంజలి
న్యూఢిల్లీ: వరుసగా మల్టీ కంపెనీలను దెబ్బతీస్తున్న యోగా గురువు రామ్ దేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ నుంచి ఇక జీన్స్ ప్యాంట్లు రానున్నాయి. త్వరలో స్వదేశీ జీన్స్ తీసుకు రానున్నట్లు రామ్ దేవ్ బాబా తెలిపారు.
భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో తీసుకొస్తామని చెప్పారు. శుద్ధి చేసిన వంట నూనెలను కూడా ఈ ఏడాదే విడుదల చేస్తామన్నారు.
నాగ్పూర్లోని మిహాన్ వద్ద ఏర్పాటు చేయనున్న రెండో మానుఫ్యాక్చరింగ్ సెంటర్ దేశంలోనే అతి పెద్దదని రాందేవ్ బాబా తెలిపారు. నలభై లక్షల చ.అ. విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే హరిద్వార్లో సంస్థకు ఒక ఉత్పత్తి కేంద్రం ఉన్న విషయం తెలిసిందే.
రూ.1000 కోట్ల వరకు పెట్టుబడులు పెడుతున్నామని, పదివేల నుంచి పదిహేను వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఎగుమతుల కేంద్రాన్ని కూడా స్థాపిస్తామన్నారు.
కాగా, తయారీ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, అసోం, జమ్ము కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. కాగా, ఇప్పటికే తమ ఉత్పత్తులకు నేపాల్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియాలో విక్రయ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు.
త్వరలో పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్లకు కూడా విస్తరిస్తామన్నారు. 90 శాతం ముస్లిం జనాభా ఉన్న అజర్బైజాన్లోనూ తాము వ్యాపారం ప్రారంభించామని, అక్కడి ఒక పెద్ద పారిశ్రామికవేత్త తమ ఉత్పత్తులపై అమితాసక్తి చూపిస్తున్నట్లు పేర్కొన్నారు. కెనడాకు కూడా తమ ఉత్పత్తులు చేరుతున్నట్లు రామ్దేవ్ పేర్కొన్నారు.