చిరంజీవితో సయోధ్య, బాబును ఎదుర్కోవడానికేనా?: జలీల్ ఖాన్, బుద్ధా వెంకన్నలతో దాసరి భేటీ
వైరుధ్యాలకు స్వస్తి చెప్పి దాసరి నారాయణ రావు, చిరంజీవి ఒక్కటైనట్లు కనిపిస్తున్నారు. అదే సమయంలో టిడిపి నేతలతో దాసరి సమావేశమయ్యారు.
విజయవాడ: తెలుగు దర్శక నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావుకు, మెగాస్టార్ చిరంజీవికి మధ్య పూర్తి స్థాయిలో సయోధ్య కుదిరినట్లు కనిపిస్తోంది. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం.150 ప్రీ రిలీజింగ్ ఫంక్షన్కు దాసరి నారాయణ రావు హాజరయ్యారు. ఆ సినిమాపై ఇటీవల దాసరి నారాయణరావు పాజిటివ్గా కూడా మాట్లాడారు.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల ఉద్యమం విషయంలో ఇరువురి మధ్య సామరస్యవూర్వక వాతావరణం నెలకొన్నట్లు కనిపించింది. అయితే, చిరంజీవి సినిమా వేడుకకు ఆయన రావడాన్ని బట్టీ ఇరువురి మధ్య పూర్తి స్థాయిలో విభేదాలు తొలిగిపోయినట్లు అర్థం చేసుకోవచ్చు.
గతంలో వారిరువురికి మధ్య పడేది కాదు. చిరంజీవిపై దాసరి నారాయణ రావు వ్యంగ్యాత్మకమైన సినిమా కూడా తీశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత ఇరువురి మధ్య విభేదాలు మరింతగా పొడసూపినట్లు వార్తలు వచ్చాయి. చిరంజీవిని పార్టీలోకి తీసుకోవడానికి కాంగ్రెసు అధిష్టానం దాసరి నారాయణ రావును దూరం చేసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది.
దానికి బలం చేకూరుస్తున్నట్లుగానే పరిణామాలు సంభవిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని వచ్చే ఎన్నికల నాటికి ఎదుర్కోవడానికి నూతన సమీకరణాలు పాదుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే చిరంజీవికి, దాసరి నారాయణ రావుకు మధ్య పూర్తి స్థాయిలో సయోధ్య కుదిరిందనే ప్రచారం కూడా సాగుతోంది.
అప్పుడప్పుడు చిరంజీవి కుటుంబంపై పరోక్ష వ్యాఖ్యలు చేసే దాసరి, చిరంజీవి సినిమా ఫంక్షన్లో ఏం మాట్లాడబోతున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాసరి విజయవాడ చేరుకోగానే మీడియా ఈ విషయమై ఆయనను ప్రశ్నించింది. అయితే అక్కడ తానేమీ మాట్లాడనని, ఏదైనా ఉంటే ఫంక్షన్లోనే అని ఆయన చెప్పారు.
అన్ని వైపుల నుంచి చంద్రబాబును ఎదుర్కోవడానికి వివిధ వర్గాలు రంగం సిద్ధం చేసుకుంటుంటడమే కాకుండా వివిధ స్థాయిల్లో ప్రముఖులు కలిసి పనిచేయడానికి కూడా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలోనే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న దాసరి నారాయణ రావును కలుసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. చిరంజీవి సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన దాసరి నారాయణ రావును వారు కలుసుకున్నారు.