ప్రొఫెసర్ లక్ష్మిని వదిలిపెట్టం: పత్తిపాటి, జైలుకెళ్లొచ్చి నేతలుగా: జగన్పై అశోక్
విజయవాడ: మెడికో సంధ్యా రాణి మృతి కేసులో దోషులను ఎట్టి పరిస్థితుల్లోను వదిలే ప్రసక్తి లేదని మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదివారం నాడు అన్నారు. పత్తిపాటి బీచ్ ఫెస్టివెల్ వివాదం, వైసిపి విశాఖలో నిర్వహిస్తున్న విశాఖ జై ఆంధ్రప్రదేశ్ సభ, మెడికో సంధ్యా రాణి ఆత్మహత్యపై స్పందించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జై ఆంధ్రప్రదేశ్ సభను విశాఖలో నిర్వహించడం విడ్డూరమన్నారు. జగన్ ఈ సభను ఢిల్లీలో నిర్వహించాలని సవాల్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేందుకే జగన్ ఇలా చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
విశాఖలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బీచ్ ఫెస్టివెల్ నిర్వహించాలనే విషయమై నిర్ణయం తీసుకోకముందే రాద్దాంతం తగదన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే సంస్కృతి, సంప్రదాయాలకు విలువను ఇచ్చే పార్టీ అని చెప్పారు.
ప్రొఫెసర్ లక్ష్మీని వదిలి పెట్టేది లేదన్నారు. ఆమెను అరెస్టు చేసి తీరుతామన్నారు. ఆమె అరెస్టును తాత్సారం చేస్తున్నారన్న వాదనలను ఖండించారు. లక్ష్మీ, ఆమె భర్తలు పారిపోయారని, సెల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉన్నాయని, దీంతో పోలీసులు ట్రేస్ చేయలేకపోతున్నారని చెప్పారు. త్వరలో అరెస్ట్ తప్పదన్నారు.
జైలుకెళ్లొచ్చి నాయకులవుతున్నారు: అశోక్
సర్దార్ వల్లభాయ్ పట్లే స్వాతంత్ర్యం కోసం జైలుకు వెళ్లిన మహా నేత అని కేంద్రమంత్రి, టిడిపి నేత అశోక్ గజపతి రాజు ఆదివారం అన్నారు. పటేల్ను మనం మరిచిపోకూడదన్నారు. ఇప్పుడు జైలుకు వెళ్లి వచ్చి నాయకులు అవుతున్నారని వైసిపి అధినేత జగన్ను ఉద్దేశించి అన్నారు. గత రెండేళ్లలో కేంద్రంలో, రాష్ట్రంలో ఒక్క కుంభకోణం లేదన్నారు.