పట్టిసీమ: తెలంగాణ అభ్యంతరానికి ఎపి ఘాటు సమాధానం
హైదరాబాద్: గోదావరి నదిపై తలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంతర్రాష్ట్ర జల ప్రాజెక్టు కాదని, ఇది కొత్త ప్రాజెక్టూ కాదని, ఇతర రాష్ట్రాల నీటినీ వాడుకోవడం లేదని గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. పట్టిసీమ ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ గోదావరీ నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖను బోర్డు ఏపీ ప్రభుత్వానికి పంపించింది
తెలంగాణ రాసిన లేఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాస్తా ఘాటుగానే స్పందించింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు మంగళవారం ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్న ప్రాంతం ఎక్కడుందనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు దిగువన పూర్తిగా ఆంధ్రప్రదేశ్ భూభాగమే ఉందని, మరో 30 కిలోమీటర్లలో ఈ నీరంతా సముద్రంలో కలుస్తుందని చెప్పారు
పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలతో పట్టిసీమ ప్రాజెక్టుపై వివాదం లేదని స్పష్టం చేసింది. పట్టిసీమ నుంచి నీరు ఎగువ రాష్ట్రాలకు వెళ్లదని కూడా గ్రహించాలని సూచించింది. సముద్రంలో కలిసే నీరు సద్వినియోగం చేసుకుంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించింది. పోలవరం ప్రాజెక్టును నదుల అనుసంధానంలో భాగంగానే నిర్మిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొందని గుర్తు చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పొరుగు రాష్ట్రాలతో పేచీ ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ పట్టిసీమ విషయంలో ఎలాంటి పేచీలూ లేవని స్పష్టం చేశారు. పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు నీరందిస్తున్నామని వివరించారు. కృష్ణా నది నుంచి హైదరాబాద్కు కొంతమేర ‘గ్రావిటీ'తోనూ మరికొంత మేర ‘పంపింగ్' ద్వారా నీటిని పంపుతున్నారని చెబుతూ ఇలా రెండు విధాలుగా అందిస్తున్నంత మాత్రాన రెండు ప్రాజెక్టులు అవుతాయా అని ప్రశ్నించారు.
పోలవరం కింది భాగాన పట్టిసీమను తాత్కాలికంగా నిర్మిస్తున్నామని, పోలవరం ప్రాజెక్టు పూర్తయిన వెంటనే దీనిని తొలగిస్తామని కూడా వివరించారు. పట్టిసీమ ప్రాజెక్టుపై వ్యక్తం చేసే అభ్యంతరాలకు అర్థమే లేదని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.