చంద్రబాబుకు ప్రేమతో: పాయసం తీసుకొచ్చి ఇచ్చిన పట్టిసీమ రైతులు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిసిన పట్టిసీమ రైతులు..వారు స్వయంగా చేసి తీసుకొచ్చిన పాయసాన్ని ఆయనకు అందజేశారు.
అమరావతి: పట్టిసీమతో తమ ప్రాంతం సస్యశ్యామలం అవుతోందని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిసిన రైతులు..వారు స్వయంగా చేసి తీసుకొచ్చిన పాయసాన్ని ఆయనకు అందజేశారు. తమ పంట పొలాల నుంచి వచ్చిన ధాన్యంతో దీన్ని తయారుచేసినట్లు చెప్పారు.
పాయసంతో పాటు, అటుకులు, ఇతర ధాన్యాలను సీఎంకు రైతులు అందజేశారు. ఈరోజు అసెంబ్లీ వద్ద సీఎంను కలుసుకున్న రైతులు పట్టిసీమ ప్రాజెక్టు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీఎంకు వారు ధన్యవాదాలు తెలియజేశారు.
రైతులతో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న నీటీ ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని ముందు చూపుతో పట్టిసీమను రూపొందించామని అన్నారు. అనుకున్న సమయానికి పోలవరంను కూడా పూర్తి చేసి రాష్ట్రంలో కరువును శాశ్వతంగా తరిమికొడుతామని స్పష్టం చేశారు.
కాగా, గోదావరి జలాలను కృష్ణానదిలో కలపడానికి ఉద్దేశించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎలాంటి అంచనా వ్యయం సవరించకుండా నిర్దేశించిన ఏడాది గడువులోగానే పూర్తిచేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి నేతలు ఈ ప్రాజెక్టు దండగ అని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి తీసుకెళ్లి సముద్రంలో కలుపుతున్నారని ఇటీవలే ఆయన ఆరోపణలు చేశారు. దీనిపై బహిరంగ చర్చకు సైతం సిద్దమని ఆయన ప్రకటించారు.