ఇవాళ పండుగ దినం, హోదాపై..: సుజన, ప్రభుత్వంపై సోము వీర్రాజు ఆగ్రహం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి ఈ రోజు (బుధవారం) పండుగ దినమని కేంద్రమంత్రి, టిడిపి సీనియర్ నేత సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం రాష్ట్ర చరిత్రలోనే సువర్ణక్షరాలతో లిఖించదగ్గదన్నారు.
ఇది చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేసిన కాటన్ దొర లాగే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును తెలుగు ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై నీతి ఆయోగ్లో చర్చలు ప్రారంభమయ్యయాన్నారు.చర్చలు త్వరలోనే ఓ కొలిక్కి వస్తాయన్నారు.
పోలవరం పనులపై సోము వీర్రాజు అసంతృప్తి
పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, అధికారులకు మధ్య సమన్వయం లోపించిందన్నారు. పట్టిసీమను త్వరగా పూర్తి చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
మా హయాంలోనే: రఘువీరా రెడ్డి
నదుల అనుసంధానం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రారంభమైందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి వేరుగా అన్నారు. అనుసంధానం ఇప్పుడు చేసినట్లు టిడిపి చంకలు గుద్దుకుంటున్నారని విమర్శించారు.
ఏపీ డీజీపీ వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్రంలోని ఐజీలు, డీఐజీలు, ఏడీజీలతో ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుమల బ్రహ్మోత్సవాల భద్రత, గణేశ్ నవరాత్రి మహోత్సవాలపై డీజీపీ సమీక్ష నిర్వహించారు.