కనిపించని కాటమరాయుడు..! గురి తప్పిన గబ్బర్ సింగ్..!!
అమరావతి/హైదరాబాద్ : గాజు గ్లాసు చిట్లి పోయింది. ఎన్నికల వేడి తో కూడుకున్న కాఫీని గ్లాసు తట్టకోలేక బోర్లా పడింది. తొలిసారి ఎన్నికల్లో పోటికి దిగిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు ఊహించిన షాక్ తగిలింది. మార్పు కోసం ఓటేయండి అన్న జనసేనాని మాటలను ఆంధ్రప్రజలు తిరస్కరించారు. సర్వే చేయించుకొని మరి తన గెలుపుకు అనువైన రెండు స్థానాలు భీమవరం, గాజువాకలో పోటీచేసిన పవన్ కల్యాణ్కు ఆ రెండు చోట్లలో ఒక చోట గట్టి ఎదురుదెబ్బే తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. 7 రౌండ్ల కౌంటింగ్ పూర్తేయ్యే సరికి జనసేనాని ప్రత్యర్థుల కంటే వెనుకంజలో ఉన్నారు. భీమవరంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్, గాజువాకలో తిప్పల నాగిరెడ్డిలు ముందంజలో ఉన్నారు. ఈ ఇద్దరు భారీ ఆధిక్యంతో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. వైఎస్ జగన్ చరిష్మా ముందు పవన్ స్టార్డమ్ కొట్టుకుపోయింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ జోరు కొనసాగుతోంది. భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సచివాలయంలో అధికారులు అప్రమత్తమైయ్యారు. భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం సహా సచివాలయం నుంచి ఎలాంటి ఫైల్స్ బయటకు తరలించకుండా చూడాలని సెక్యురిటి సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ సహా పలు శాఖల్లో కీలక ఫైల్స్ ధ్వంసం చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశం నిర్వహించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తన మద్దతుదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు వైఎస్ జగన్, చంద్రబాబు నివాసాల వద్ద భద్రతను పెంచారు.