బీజేపీకి, టీడీపీకి మధ్య బ్రోకర్ పవన్, వారి స్వార్ధం కోసమే రాజధాని రభస : వైసీపీ నేత ఫైర్
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనను వ్యతిరేకిస్తూ టీడీపీ ఆందోళనల బాట పట్టింది ఇక మరోపక్క జనసేన కూడా రాజధాని అమరావతికే మొగ్గు చూపుతున్నారు. రాజధానిని తరలిస్తే ఊరుకోమని చెప్తున్నారు . అంతే కాదు రాజధాని ప్రాంత రైతులతో కలిసి పోరాటం చేస్తున్న టీడీపీ నాయకులు, అధినేత చంద్రబాబు వైసీపీ నేతలు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా రాజధాని విషయంలో వైసీపీ నేత సి. రామచంద్రయ్య టీడీపీ, జనసేనలపై విమర్శలు గుప్పించారు.
అమరావతి రైతులు పండుగ సంబరాల్లో ఉన్నారు .. ఆందోళనల్లో ఉంది రైతులు కాదు : మంత్రి అవంతి
గత ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు బాగా బుద్ధి చెప్పారు
రాజధాని వ్యవహారంపై ఏపీలో వైసీపీ నేత సి. రామచంద్రయ్య ఘాటుగా స్పందించారు .అమరావతిపై చంద్రబాబు లేనిపోని అపోహలు కల్పిస్తున్నారని మండిపడ్డ ఆయన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బహుళ రాజధానులు కరెక్ట్ అని శివరామకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. జగన్ మూడు రాజధానుల నిర్ణయం సరైనదని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు బాగా బుద్ధిచెప్పారని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ను చూసే మూడు రాజధానుల ప్రస్తావన తీసుకురాలేదన్న రామచంద్రయ్య అమరావతి రైతులకు అన్యాయం జరగదని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు పంపిన పెయిడ్ ఆర్టిస్ట్ అన్న వైసీపీ నేత
కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజధాని విషయంలో రభస సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సి. రామచంద్రయ్య.పవన్కళ్యాణ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారని నిప్పులు చెరిగారు. అమరావతి ప్రాంత రైతులను దురుద్దేశంతోనే రెచ్చగొడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో చేసే కుట్రలు ఇప్పుడు చేస్తున్నారని వ్యాఖ్యానించారు రామచంద్రయ్య.
బీజేపీకి, టీడీపీకి మధ్య బ్రోకర్లా పవన్కళ్యాణ్ అంటూ ఫైర్
బీజేపీకి, టీడీపీకి మధ్య బ్రోకర్లా పవన్కళ్యాణ్ తయారయ్యారని ఆయన విరుచుకుపడ్డారు . రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోనివి చెప్పడానికే పవన్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు . పవన్ చెప్పిన విషయాలు విన్న బీజేపీ నాయకుడు జేపీ నడ్డా తమకు అన్ని తెలుసునని చెప్పినట్లు సమాచారం అని రామచంద్రయ్య పేర్కొన్నారు. రాజధాని పేరుతో రాజకీయ పబ్బం గడుపుకోటానికే చంద్రబాబు రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్నట్టు డ్రామాలు ఆడుతున్నారని రామచంద్రయ్య ఫైర్ అయ్యారు.