కెసిఆర్ జోరు: పవన్కి జీవిత తోడు, జూ ఎన్టీఆర్ సస్పెన్స్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేపటి (శుక్రవారం) నుండి తెలంగాణ ప్రాంతంలో పర్యటించనున్నారు. తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ప్రచారం అనంతరం బిజెపిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మోడీతో పాటు పవన్ ప్రచారంలో పాల్గొనడం వారిని మరింత ఉత్తేజితులను చేసింది. మొన్నటి వరకు బిజెపి పోటీలు ఉన్నప్పటికీ అంత చురుకుగా కనిపించలేదు. మోడీ సభల అనంతరం వారు దూసుకెళ్తున్నారు.
పార్టీలో స్టార్ కంపెయినర్ ఎవరు లేకపోవడంతో బిజెపి అభ్యర్థుల్లో కొంత కలవరం కనిపించింది. అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో వారిలో మరింత జోరు కనిపిస్తోంది. పవన్ ప్రచారం తమకు విజయానికి దోహదం చేస్తుందని వారు ధీమాతో ఉన్నారు. పవన్ ఈ నెల 25, 26, 27, 28 తేదీలలో తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఆయన టిడిపి - బిజెపి ఉమ్మడి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు.
పవన్ షెడ్యూల్
పవన్ ఈ నాలుగు రోజులలో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలలో ప్రచారం చేయనున్నారు. 25వ తేదీన.. శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, సనత్నగర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో, 26న సిరిసిల్ల, హుస్నాబాద్, పాలకుర్తి, 27న ఎల్బీనగర్, అంబర్పేట, ఖైరతాబాద్, ఇబ్రహీంపట్నం, 28న నల్గొండ, భువనగిరి, మహబూబ్నగర్ నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం చేస్తారు. పవన్ కోసం బిజెపి ఓ హెలికాప్టర్ను సిద్ధం చేసింది.
జూ ఎన్టీఆర్ సస్పెన్స్
తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారని, ఈ రోజు ఆయన తన నిర్ణయాన్ని చెబుతారనే ప్రచారం జరిగింది. అయితే, ఇప్పటి వరకు జూనియర్ పెదవి విప్పలేదు. ఆయన ప్రచారంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే, జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయకపోవచ్చునని అంటున్నారు.
కిషన్తో జీవిత
తెలంగాణ ప్రాంతంలో బిజెపి అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మూడు రోజుల పాటు ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ప్రచారం చేసిన ఆయన.. రేపు, ఎల్లుండి ఆయన ప్రచారం చేస్తారు. ఆయనతో పాటు దర్శక నిర్మాత జీవిత కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కిషన్, జీవితల కోసం కూడా అధిష్టానం ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చింది. మోడీ, పవన్, కిషన్ల ప్రచారంతో తెరాస అధ్యక్షులు కెసిఆర్, కాంగ్రెసు పార్టీల దూకుడును తగ్గించవచ్చునని బిజెపి భావిస్తోంది.