ఓటమిపై నోరువిప్పిన పవన్ : రాజకీయాల్లో కొనసాగడంపై కామెంట్
Recommended Video
అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తున్నట్టు స్పష్టంచేశారు పవన్ కల్యాణ్. విజయం సాధించిన వైసీపీకి అభినందనలు తెలిపారు. స్వచ్చమైన రాజకీయాలు చేసినందుకు తనకు సంతృప్తిగా ఉందన్నారు పవన్.
తీర్పును శిరసావహిస్తా ..
ఏపీ అసెంబ్లీలో వైసీపీ జయకేతనం ఎగరేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ మీడియాతో మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా .. స్వచ్చమైన రాజకీయాలు చేసినందుకు తనకు తృప్తిగా ఉందని చెప్పారు. తాము ఎక్కడా డబ్బు, మద్యం పంచలేమని స్పష్టంచేశారు. తమ పార్టీ విధానాలు అదికాదని .. సుపరిపాలన అందిస్తామని హామీనిస్తామని .. కానీ డబ్బులు పంచమని తేల్చిచెప్పారు. భవిష్యత్తులో కూడా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయమని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : జగన్
చివరి శ్వాస వరకు ..
తాను స్వల్పకాలిక లక్ష్యాల కోసం పార్టీ పెట్టలేదన్నారు పవన్. దీర్ఘకాలిక వ్యుహరచన ఉందని తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టారు. దాదాపు 25 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉంటానని .. అధికారం శాశ్వతం కాదని వేదాంతం చెప్పారు. తాను పార్టీ పెట్టేటప్పుడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం .. తన శ్వాస ఉన్న చివరి వరకు రాజకీయాల్లో ఉంటానని స్పష్టంచేశారు.
ఒక్క ఎమ్మెల్యే ..
ఏపీలో కింగ్ మేకర్ అవుదామని జనసేన పార్టీని స్థాపించారు పవన్ కల్యాణ్. ఎన్నికల సందర్భంగా ప్రజల్లోకి కూడా వెళ్లారు. కానీ ప్రజల నుంచి ఆశించిన మద్దతు రాలేదు. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే కేవలం ఒక్కచోట మాత్రమే విజయం సాధించింది. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం తప్పితే జనసేన ఖాతా తెరవకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా మట్టికరిచారు. ఎన్నికల్లో తమకు ఓటు షేర్ పెరుగుతుందని భావించిన పవన్ కల్యాణ్ .. బీఎస్పీ, కామ్రేడ్లతో పొత్తు పెట్టుకున్నారు. అయినా ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదు. కేవలం ఒక్క సీటుకు పరిమితం చేశారు ప్రజలు.