తిరుపతి సీటుపై బీజేపీతో జనసేన కుస్తీ... ఢిల్లీ నుంచి పవన్ ఏ కబురు మోసుకొస్తారో...
తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో జనసేన పోటీ నుంచి తప్పుకుని మిత్రపక్షం బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పవన్ నిర్ణయంపై జన సైనికులే తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇదే ధోరణితో జనసేన ముందుకెళ్తే రాజకీయాల్లో కేవలం సపోర్టింగ్ పార్టీగా మిగిలిపోతుందన్న విమర్శలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ కీలక నిర్ణయానికి వచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నందుకు బీజేపీని ప్రతిఫలం అడగబోతున్నారు... ఇంతకీ ఏంటా ప్రతిఫలం...
అందుకు ప్రతిఫలంగా...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం(నవంబర్ 24) ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన భేటీ కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ అగ్ర నేతలతోనూ సమావేశమయ్యే అవకాశం ఉంది. అమరావతి,పోలవరం,తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయం,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం తదితర అంశాలపై పవన్ వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అన్నింటికంటే ప్రధానంగా పవన్ 'తిరుపతి' ఉపఎన్నికపై బీజేపీ ముందు కీలక ప్రతిపాదన పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించినందునా... అందుకు ప్రతిఫలంగా తిరుపతి ఉపఎన్నిక సీటును జనసేనకే కేటాయించాలని పవన్ కోరబోతున్నట్లు తెలుస్తోంది.
సామాజిక సమీకరణాల రీత్యా...
తిరుపతి లోక్సభ సెగ్మెంట్లో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నిజానికి ఇక్కడ ఇరు పార్టీలకు పెద్దగా ఓటు బ్యాంకు లేదు. అయితే పవన్ సామాజికవర్గమైన కాపు ఓటు బ్యాంకు ఇక్కడ నిర్ణయాత్మక శక్తిగా ఉందని జనసేన చెబుతోంది. 2009 సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తుచేస్తోంది. ఇవే అంశాలను ఇప్పుడు పవన్ బీజేపీ అధిష్టానం ముందు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తిరుపతి సామాజిక సమీకరణాల రీత్యా ఆ సీటు జనసేనకే ఇవ్వాలని ఆయన కోరే అవకాశం ఉంది.
బీజేపీ విముఖత...?
మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వం తిరుపతి సీటును జనసేనకు ఇచ్చేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే అధిష్టానానికి కూడా స్పష్టమైన సమాచారం ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో పార్టీ కొత్త అధ్యక్షుడు బండి సంజయ్ సారథ్యంలో దుబ్బాక ఉపఎన్నికను గెలుచుకున్నట్లే... ఏపీలోనూ తిరుపతి ఉపఎన్నికను గెలుచుకుంటామని ఆ పార్టీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు అధిష్టానం వద్ద ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో దుబ్బాక గెలుపు అక్కడ బీజేపీ బలపడేందుకు అవకాశం కల్పించిందని... ఏపీలోనూ బీజేపీ బలపడాలంటే పోటీలో మనమే ఉండాలని ఆ పార్టీ నేతలు పట్టబుడుతున్నట్లు సమాచారం. దీంతో బీజేపీ-జనసేన కుస్తీలో తిరుపతి ఉపఎన్నిక టికెట్ ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
జన సైనికులు ఏమంటున్నారు..
తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ మాట్లాడుతూ... ఇటీవల మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో తిరుపతి ఉపఎన్నిక గురించి అధినేత పవన్ కల్యాణ్ వద్ద ప్రస్తావించినట్లు చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు,ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయని... జనసేన బరిలో ఉంటే గట్టి పోటీ ఇవ్వవచ్చునని చెప్పామన్నారు. అయితే తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి బరిలో ఉన్నా... జనసేన అభ్యర్థి బరిలో ఉన్నా గెలిపించుకోవాల్సిన బాధ్యత జన సైనికులపై ఉందని పవన్ చెప్పినట్లు తెలిపారు. పవన్ తాజా ఢిల్లీ టూర్ ఎజెండాపై తమకు సమాచారం లేదన్నారు. ఏదేమైనా పవన్ ఢిల్లీ టూర్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ నుంచి ఆయన ఏ కబురు మోసుకొస్తారన్న ఉత్కంఠ జన సైనికుల్లో నెలకొంది. పవన్ ప్రతిపాదనకు బీజేపీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.