పవన్ కొత్త సూచన: ఒక్కరోజు కాదు వారం రోజులు...!
మంగళగిరి: దేవుడి కంటే దేశాన్నే తాను ఎక్కువగా విశ్వసిస్తానని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనాని జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం ప్రసంగించారు. కేవలం జెండా ఎగురవేసి 15 నిమిషాల పాటు కార్యక్రమంలో పాల్గొంటే సరిపోదని అన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వగల తత్వం అలవర్చుకోవాలని చెప్పారు. ఇక కులాలు మతాలపై ఎంతో మంది ఎన్నో పుస్తకాలు రాశారని చెప్పిన పవన్ కళ్యాణ్... దేశంకోసం పుస్తకాలు రాసేవారే కనుమరుగయ్యారని అన్నారు.
దేశం కోసం గట్టిగా నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క జనసేన పార్టీనే అని పవన్ కళ్యాణ్ చెప్పారు. స్వాతంత్ర్య వేడుకలను వారం రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్ర తెలిసిన నాయకులు ఎవరూ అవినీతికి అరాచకాలకు పాల్పడరని అన్నారు. ఆగష్టు 15కంటే ముందు వారం రోజులపాటు వేడుకలు నిర్వహించాలని చెప్పారు. దేశమన్నా దేశం కోసం ఏదైనా చేయాలన్న తపన పవన్ కళ్యాణ్లో ముందునుంచే ఉంది. అది ఆయన సినిమాల్లో కూడా కనిపిస్తుంది. తన ప్రతి ప్రసంగంను జైహింద్, భారత్ మాతాకీ జై అన్న నినాదంతో ముగిస్తారు.
ఇక పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్... చిన్నారిని ఎత్తుకుని సరదాగా గడపడం కనిపించారు. ఇక జెండా వందనం అయ్యాక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చాలామంది జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. రాష్ట్ర నలమూలల నుంచి అభిమానులు తరలిరావడంతో పార్టీ కార్యాలయం కిక్కిరిసింది.