అంతర్వేది రథం నిర్మాణంపై పవన్ కొత్త డిమాండ్- వారికే అవకాశం ఇమ్మంటూ...
అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధమైన నేపథ్యంలో కొత్త రథం నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్త రథం నిర్మాణానికి ఇప్పటికే కలపను సిద్ధం చేయడంతో పాటు రావులపాలెంలో దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఫిబ్రవరిలో స్వామి వారి కళ్యాణోత్సవం లోగా రథం ఎట్టి పరిస్ధితుల్లోనూ సిద్ధం కావాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
అంతర్వేది ఆలయ రథం తయారీ ప్రారంభం- ప్రత్యేక పూజలు.. కళ్యాణోత్సవం కల్లా సిద్దం...
అంతర్వేది లక్ష్మీనరసింహుని ఆలయంలో కొత్త రథం నిర్మాణం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కొత్త రథం నిర్మాణంలో ప్రభుత్వం ఆలయ సంప్రదాయాలతో పాటు స్ధానికుల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు.
అంతర్వేది లక్ష్మీ నారసింహుడిని అగ్నికుల క్షత్రీయులు కుల దైవంగా పూజిస్తుంటారని, ఈ ఆలయాన్ని అగ్నికుల క్షత్రీయుడైన కొపనాతి కృష్ణమ్మ నిర్మించారని పవన్ గుర్తుచేశారు. ఇప్పుడు కొత్త రథం నిర్మాణంలో తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై అగ్నికుల క్షత్రియులు తనకు లేఖ రాశారని, వారు ప్రస్తావించిన అంశాలు సహేతుకంగా ఉన్నాయని పవన్ తెలిపారు. రథం రూపకల్పన కమిటీలో వారికి స్ధానం లేకపోవడం శోచనీయమన్నారు.
Recommended Video
అంతర్వేది రథం తయారీని ఇతర రాష్ట్రాల వారికి అప్పగించారని, అంతకంటే తక్కువకే తయారు చేసే వారు రాష్ట్రంలోనే ఉన్నారని, వారికి ఆ బాధ్యతలు అప్పగించాలని పవన్ కోరారు. ఆలయ సంప్రదాయాల పరంగా చూసినా, అగ్నికుల క్షత్రియుల మనోభావాల ప్రకారం చూసినా ఈ బాధ్యత వారికి అప్పగిస్తేనే మంచిదని పవన్ ప్రభుత్వానికి సూచించారు. రథోత్సవం నాడు తొలి కొబ్బరికాయ కొట్టి రథాన్ని లాగేది కూడా అగ్నికుల క్షత్రీయులే అయినందున వారి మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ పేర్కొన్నారు.